కేరళను ముంచెత్తిన వరదలు.. గూగుల్ సాయం.. ఎంతో తెలుసా?

మంగళవారం, 28 ఆగస్టు 2018 (15:54 IST)
కేరళలోని వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వరదలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కేరళలో ప్రభుత్వం స్నేక్ అలర్ట్ ప్రకటించింది. ఆస్పత్రుల్లో పాము కాటు విరుగుడు మందులను అందుబాటులో ఉంచింది. ఇళ్లలోని కప్ బోర్డుల్లో, బ్లాంకెట్స్ కింద, దుస్తుల్లో, వాషింగ్ మిషన్ల కింద ఎక్కడైనా పాములు ఉండవచ్చునని ప్రభుత్వం ప్రజలను హెచ్చరికలు జారీ చేసింది. 
 
ఈ నేపథ్యంలో కేరళలోని వరద బాధిత ప్రాంతాలను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరిశీలించారు. కేరళలోని చెంగన్నూర్‌లో ఏర్పాటు చేసిన వరద బాధితుల పునరావాస కేంద్రాన్ని మంగళవారం రాహుల్ గాంధీ సందర్శించారు.
 
మరోవైపు కేరళ వరద బాధితులకు సాయం చేసేందుకు అన్నీ రంగాల వారు ముందుకొస్తున్నారు. తాజాగా కేరళను ఆదుకోవడానికి సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ముందుకొచ్చింది. సంస్థ తరఫున దాదాపు ఏడు కోట్ల రూపాయలను విరాళంగా ఇవ్వనున్నట్లు గూగుల్ తెలిపింది. 
 
గూగుల్.ఓఆర్‌జీ, గూగులర్స్ కలిసి కేరళ సహాయక చర్యల కోసం మిలియన్ డాలర్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్‌లో పాల్గొన్న ఆ సంస్థ ఆగ్నేయాసియా వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ తెలిపారు. కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి గూగుల్ క్రైసిస్ రెస్పాన్స్ టీమ్ పలు రకాల చర్యలను చేపట్టింది.
 
కాగా రెండు నెలలుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా కేరళలో 417 మంది మృత్యువాత పడగా.. 8 లక్షల మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఈ వరదల కారణంగా కేరళకు సుమారు 20 వేల కోట్ల నష్టం వాటిల్లింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు