పాకిస్థాన్‌కు మరో షాకిచ్చిన కేంద్రం... దిగుమతులపై నిషేధం!

ఠాగూర్

శనివారం, 3 మే 2025 (13:44 IST)
పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం దాయాది దేశం పాకిస్థాన్‌పై అనేక రకాలైన కఠిన చర్యలను చేపడుతోంది. ఇందులోభాగంగా, ఇప్పటికే సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. పాకిస్థాన్ విమానాలకు భారత గగనతలాన్ని మూసివేసింది. పాక్ పౌరులు దేశం వీడి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీచేసింది. తాజాగా మరో కఠిన నిర్ణయం తీసుకుంది. మేడిన్ పాకిస్తాన్ వస్తువుల దిగుమతిపై నిషేధం విధించింది. జాతీయ భద్రత, ప్రజా విధానాల ప్రయోజనాల దృష్ట్యా పాకిస్తాన్ నుంచి జరిగే అన్ని రకాల దిగుమతులను తక్షణమే నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటన జారీచేసింది. 
 
పాకిస్థాన్ నుంచి నేరుగాగానీ, పరోక్షంగాగానీ వచ్చే అన్ని రకాల వస్తువుల దిగుమతులపై ఈ నిషేధం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మేడిన్ పాకిస్థాన్ వస్తువులకు భారత్‌లో చోటులేదని, అక్కడ నుంచి ఎగుమతి అయిన ఏ వస్తువైనా భారత్‌లోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం రవాణా మార్గంలో ఉన్న సరకులకు కూడా ఈ నిషేధం విర్తిస్తుందని తెలిపింది. 
 
"పాకిస్థాన్ మూలం ఉన్న లేదా అక్కడ నుంచి దిగుమతి అయిన ఏ వస్తువైనా సరే భారత్‌లోకి అనుమతించబోం. అన్ని రకాలైన వస్తువుల దిగుమతి లేదా రవాణాపై నిషేధం అమలు చేస్తున్నాం. జాతీయ భద్రత, ప్రజా విధానం దృష్ట్యా ఈ అంక్షలు విధించడం జరిగింది" అని వాణిజ్య శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో ఏవైనా మినహాయింపులు కావాలంటే భారత ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని అందులో స్పష్టంగా పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు