రసవత్తరంగా జార్ఖండ్ రాజకీయాలు.. బీజేపీ గూటికి చేరనున్న చంపై సోరేన్!!

ఠాగూర్

సోమవారం, 19 ఆగస్టు 2024 (09:52 IST)
జార్ఖండ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత చంపై సోరేన్ భారతీయ జనతా పార్టీ గూటికి చేరనున్నారు. ఈ మేరకు ఆయన బీజేపీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. దీంతో జార్ఖండ్ రాష్ట్రం సంక్షోభం దిశగా పయనిస్తున్నట్టు కనిపిస్తుంది. 
 
మరోవైపు, మాజీ సీఎం చంపై సోరెన్, ఇతర ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారనే ఊహాగానాలపై జార్ఖండ్ ముఖ్యమంత్రి, జేఎంఎం పార్టీ చీఫ్ హేమంత్ సోరెన్ తొలిసారి పెదవి విప్పారు. కుటుంబాలను, పార్టీలను చీల్చేందుకు బీజేపీ డబ్బును ఉపయోగిస్తోందని ఆయన ఆరోపించారు. బీజేపీ.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని, డబ్బు ప్రభావంతో నాయకులు పెద్దగా ఆలోచించకుండా వెంటనే సులభంగా పక్క పార్టీల్లోకి వెళ్లిపోతున్నారని ఆరోపించారు. 
 
పాకుర్ జిల్లాలో జరిగిన జార్ఖండ్ ముఖ్యమంత్రి మైనీయ సమ్మాన్ యోజన (జేఎంఎంఎస్) కార్యక్రమంలో హేమంత్ సోరెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంపై సోరెన్ పార్టీ మారే అవకాశం ఉందంటూ గట్టిగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎం హేమంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ ఏడాదే జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడి రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
 
మరోవైపు, సీఎం హేమంత్ సోరెన్ ఎన్నికల సంఘంపై కూడా విమర్శలు గుప్పించారు. ఈసీ రాజ్యాంగబద్ద సంస్థగా కాకుండా బీజేపీ సంస్థగా మారిపోయిందని ఆరోపించారు. జార్ఖండ్‌లో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని బీజేపీకి ఆయన సవాల్ విసిరారు. ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు జేఎంఎం పార్టీకి అనుకూలంగా ఉంటాయని, నిర్ణయాత్మకమైన విజయాన్ని సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు