16 యేళ్ళ బాలికపై తొమ్మిది మంది గ్యాంగ్ రేప్.. ఎక్కడ?

శుక్రవారం, 27 మార్చి 2020 (10:04 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. 16 యేళ్ళ బాలికపై ఏకంగా తొమ్మిది మంది కామాంధులు అత్యాచారానికి తెగబడ్డారు. ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి ఇచ్చిన వాంగ్మూలం మేరకు... 
 
మంగళవారం మధ్యాహ్నం తన స్నేహితుల్లో ఇద్దరు వచ్చి బాలికను బైక్‌పై ఓ స్నేహితుడి గ్రామ సమీపంలోని నీటి కొలను వద్దకు తీసుకువెళ్లారు. కాసేపు అనంతరం తనను ఇంటి దగ్గర దిగబెట్టాల్సిందిగా మరో స్నేహితుడికి ఫోన్‌ చేసి అడిగింది. అతడు మరో యువకుడితో కలిసి బైక్‌పై యువతి ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. 
 
బైక్‌పై యువతిని ఎక్కించుకుని అటవీ మార్గం గుండా దగ్గరి దారి ఉందని చెప్పి బైక్‌ను దారి మళ్లించారు. అడవి లోపల మరో ఏడుగురు యువకులు ఉన్నారు. మిగిలిన ఎనిమిదిమంది తన స్నేహితుడితో కలిసి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని తన వాంగ్మూలంలో పేర్కొంది. 
 
యువతి అపస్మారకస్థితిలోకి వెళ్లిన అనంతరం యువకులంతా అక్కడి నుంచి పరారయ్యారు. మరుసటి రోజు ఉదయం ఆమె మెలకువలోకి వచ్చింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. నిందితులంతా పరారీలో ఉన్నట్లు వారిని అరెస్ట్‌ చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ వై.ఎస్‌. రమేష్‌ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు