కేసీఆర్ చర్యలు భేష్, తెలంగాణలో కరోనా ఉదృతి తగ్గుముఖం: కేంద్ర మంత్రి

బుధవారం, 12 మే 2021 (22:45 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్దన్ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు కావాల్సిన ఆక్సీజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు, వ్యాక్సీన్లు, టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు తదితర కరోనా సంబంధిత మందులు సామాగ్రి కోటాను పెంచి సత్వర సరఫరా చేస్తామని రాష్ట్రానికి కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.
 
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్దన్ వివిధ రాష్ట్రాలతో బుధవారం వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్ నుంచి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మంత్రి హరీష్ రావు వీడియో కాన్పరెన్స్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిఎం సెక్రటరీ, కోవిడ్ ప్రత్యేక అధికారి రాజశేఖర్ రెడ్డి,హెల్త్ డైరక్టర్ శ్రీనివాసరావు, డిఎంఈ రమేశ్ రెడ్డి, టెక్నికల్ అడ్వయిజర్ గంగాధర్ లు పాల్గొన్నారు.
 
 వివిధ రాష్ట్రాలలో కరోనా పరిస్థితిని, కట్టడికోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, తదితర అంశాలను కేంద్ర మంత్రి  అడిగితెలుసుకున్న నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులను నియంత్రిత చర్యలను మంత్రి హరీష్ రావు వివరించారు. రాష్ట్రానికి కావాల్సిన వాక్సీన్లు ఆక్సీజన్ తదితరాల కోటా ను మరింతగా పెంచి సత్వరమే రాష్ట్రానికి సరఫరా అయ్యేలా చూడాలని కేంద్ర మంత్రిని కోరారు.
 
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు వీడియో కాన్పరెన్సులో మాట్లాడుతూ.. మొదటి వేవ్ కరోనా సందర్భంలో వున్న మౌలిక వసతులను రెండో వేవ్ వరకు రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా పెంచిందని వివరించారు. నాడు కేవలం 18,232 బెడ్లు మాత్రమే వుంటే నేడు వాటి సంఖ్య 53,775 కి అంటే మూడు రెట్లు పెరిగిందన్నారు. సిఎం కెసిఆర్ ముందు చూపుతో, 9213గా వున్న ఆక్సీజన్ బెడ్లను 20738 కి,. ఐసియు బెడ్లను 3264 నుంచి 11274 కు ప్రభుత్వం పెంచిందన్నారు. ఉన్నవాటికంటే మూడు రెట్లకు పెంచామని చెప్పారు.
 
రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సిఎం కెసిఆర్ ఆదేశాలతో వైద్యారోగ్యశాఖ డోర్ టు డోర్ కొవిడ్ పీవర్ సర్వే ను నిర్వహిస్తున్నదని వివరించారు. అంగన్ వాడీ, ఆశా వర్కర్లు, ఎఎన్ఎం సిబ్బంది తో కూడిన  27,039 టీంలు ఇంటింటికి వెల్లి జ్వర పరీక్షలు నిర్వహిస్తున్నాయని కేంద్ర మంత్రికి తెలిపారు.  అనుమానితులకు కరోనా నియంత్రిత మందులతో కూడిన హెల్త్ కిట్లను ఉచితంగా ప్రభుత్వం అందచేస్తున్నదని తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా కరోనా సోకిన విషయం పట్ల అవగాహన లేని వారిని గుర్తించి.. కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తుగానే అడ్డుకోవడం, తద్వారా దవాఖానాలో చేరే పరిస్థితినుంచి, మరణించే ప్రమాదాలనుంచి కాపాడినట్టవుతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమం సత్పలితాలనిస్తున్నదన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 60 లక్షల ఇండ్లల్లో కోవిడ్ జ్వర పరీక్షలను నిర్వహించి అనుమానితులను ఐసోలేషన్లో వుంచి వారికి హెల్త్ కిట్లు అందజేయడం జరిగిందన్నారు.  రాష్ట్రంలో నేటినుంచి లాక్ డౌన్ అమలవుతున్నదని కేంద్రమంత్రికి తెలిపారు.
 
ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ఆదేశాలమేరకు, రాష్ట్రం తరఫున కేంద్రమంత్రికి మంత్రి హరీష్ రావు పలు విజ్జప్తులను చేశారు. తెలంగాణ మెడికల్ హబ్ గా మారిన నేపథ్యంలో, తెలంగాణలోని స్థానిక కరోనా రోగులకు అధనంగా ఇతర రాష్ట్రాలనుంచి  కరోనా రోగుల రద్దీ విపరీతంగా పెరిగిందన్నారు. తెలంగాణ చుట్టుపక్కల వున్న మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ వంటి పలు రాష్ట్రాలనుంచి   కరోనా పాజిటివ్‌గా నమోదైన వారు తెలంగాణకు వచ్చి ట్రీట్మెంటు పొందుతున్నారని తెలిపారు.

వారివారి రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌గా లెక్కింపబడి రికార్డుల్లోకి ఎక్కిన వారు తెలంగాణకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్న నేపథ్యంలో కొవిడ్ పాజిటివ్ లెక్కల్లో తేడా వస్తున్నదని తెలిపారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారిందన్నారు. తెలంగాణకు జనాభా ప్రాతిపదిక కాకుండా, ఇతర రాష్ట్రాల పాజిటివ్ కేసులను కలుపుకుని, రాష్ట్రంలో ప్రతిరోజు నమోదవుతున్న పాజిటివ్ కేసుల బెడ్ల సంఖ్య ఆధారంగా మందులు ఆక్సీజన్ ఇతరాల కేటాయింపులు జరపాలని మంత్రి కోరారు. తెలంగాణలో మందుల కొరత పెరగడానికి  ఈ లెక్కల్లో తేడా ప్రధాన కారణమని కేంద్ర మంత్రికి హరీష్ రావు  వివరించారు.
 
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి మరింతగా, అన్ని రకాల కోటాను పెంచాల్సి వున్నదని కోరారు.  ఆక్సీజన్ సరఫరా పెంచాలన్నారు. రెమిడిసివర్ ఇంజక్షన్ల కోటాను, వాక్సీన్ల కోటాను పెంచి తక్షణమే సరఫరా చేయాలని కోరారు. తెలంగాణకు కేటాయించిన 450 మెట్రిక్ టన్నుల ఆక్సీజన్ ను 600 మెట్రిక్ టన్నులకు పెంచాలన్నారు. ఒడిశా తదితర సుదూర ప్రాంతాల నుంచి కాకుండా,  దగ్గరలో వున్న రాష్ట్రాలనుంచి ఆక్సీజన్ క్రయోజనిక్ ట్యాంకర్లను కేటాయించాలని కోరారు. తద్వారా తరలింపుకు సులువవుతుందని వివరించారు. పక్కన వున్న ఆంద్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్ట్రాల నుంచి కేటాయింపులు చేయాలన్నారు.
 
ఇప్పటికే సిఎం కెసిఆర్ కేంద్ర మంత్రితో మాట్లాడివున్నందున రెమిడిసివర్ ఇంజిక్షన్లను రోజుకు 20 వేలకు పెంచాలని కేంద్ర మంత్రిని మరోమారు మంత్రి హరీష్ రావు కోరారు. ఎయిర్ అంబులెన్సుల ద్వారా అత్యవసర చికిత్సకోసం ఇతర ప్రాంతాలనుంచి కరోనా రోగులు తెలంగాణకు తరలి వస్తున్నారని,  ఈ సందర్భంగా రోజుకు కేవలం 810 మాత్రమే అందచేస్తున్న టోసిలీ జుమాబ్ మందులను రోజుకు 1500కు పెంచాలన్నారు. ప్రతిరోజు తెలంగాణకు 2 లక్షల టెస్టింగ్ కిట్లు అవసరమున్నపరిస్తితుల్లో వాటిని తక్షణమే సరఫరా చేయాలన్నారు.
 
రెండో డోస్ కొవిడ్ టీకాను ను సిఎం ఆదేశాలమేరకు నూటికి నూరుశాతం రాష్ట్రంలో అమలుపరుస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో మొదటి డోస్ కోసం 96 లక్షల వాక్సిన్లు, సెకండ్ డోస్ పూర్తిచేయడం కోసం 33 లక్షల వ్యాక్సీన్లు మొత్తం 1 కోటీ 29 లక్షల వ్యాక్సీన్ల  అవసరం వున్నదని తెలిపారు. ఈనెల చివరి  వరకు గాను 10 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సీన్లు 3 లక్షల కోవాక్సిన్ వ్యాక్సీన్లు మొత్తం 13 లక్షల వ్యాక్సీన్లు తక్షణావసరమున్నదని, వెంటనే రాష్ట్రానికి సరఫరా చేయాలని కోరారు. 2000 వెంటిలేటర్లు రాష్ట్రానికి అవసరమున్ననేపథ్యంలో తక్షణమే సరఫరా చేయాలని మంత్రి హరీష్ రావు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి విజ్జప్తి చేశారు.
 
వీడియో కాన్పరెన్సు సందర్భంగా తెలంగాణ రాష్ట్రం చేసిన విజ్జప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి హర్షవర్దన్ వివరాలన్నీ నోట్ చేసుకున్నామని, తప్పకుండా రాష్ట్ర అవసరాలరీత్యా తక్షణమే సరఫరా కు చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు