రజనీకి భార్య వెన్నుపోటు? ఆందోళనకు అన్నీ సమకూర్చిన లతా రజనీకాంత్?

బుధవారం, 13 జనవరి 2021 (13:24 IST)
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తన అనారోగ్యం దృష్ట్యా రాజకీయాల్లోకి రాకూడదని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఆయన తన అభిమాన సంఘాల నేతలతో చర్చించి ఓ స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. 
 
ఈ క్రమంలో రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలంటూ నగరంలో ఇటీవల కొందరు రజనీ అభిమానుల్ ఆందోళన చేశారు. ఇందులో మహిళలు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అయితే, ఈ ఆందోళన కార్యక్రమానికి రజనీకాంత్ సతీమణి లత రజనీకాంత్‌ పరోక్షంగా సాయం చేశారని అభిమాన సంఘం నిర్వాహకుడు సంచలనాత్మక ఆడియో విడుదల చేశారు. 
 
స్థానిక తిరువాన్మియూర్‌‌ విభాగానికి చెందిన రజనీ మక్కల్‌ మండ్రం కార్యదర్శి భాస్కర్‌ మంగళవారం విడుదల చేసిన ఆడియోలో, రజనీ రాజకీయపార్టీ స్థాపిస్తారని గట్టి నమ్మకంతో ఎదురుచూశామని, అయితే ఆయన రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడం అభిమానులను నిరాశకు గురిచేసిందన్నారు.
 
కానీ, స్థానిక నుంగంబాక్కంలోని వళ్ళూవర్ కోట్టం వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమానికి అవసరమైన వేదిక, 500 వాటర్‌ క్యాన్లు, మొబైల్‌ టాయ్‌లెట్లు తదితర సహాయాలను రజనీకాంత్‌ సతీమణి లత పరోక్షంగా అందించారని, ఆమె అసిస్టెంట్‌ సంతోష్‌ కూడా వీటిని పరిశీలించి వెళ్లారని భాస్కర్‌ తన ఆడియోలో వ్యాఖ్యానించారు. 
 
అలాగే, రజనీ మక్కల్‌ మండ్రం ప్రకటించిన ఆందోళనకు అనుమతి జారీ చేయరాదని మక్కల్‌ మండ్రం జిల్లా కార్యదర్శి ఏవీకే రాజా పోలీసులకు ఫిర్యాదు చేయగా, దానిని వాపసు తీసుకొనేలా చేసింది ఎవరనేది కూడా ఆడియో సంభాషణలో చోటుచేసుకోవడం గమనార్హం. ఈ విషయంలో కూడా లతా రజనీకాంత్ జోక్యం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఆడియో టేప్ బయటకు రావడంతో రజనీకాంత్ కూడా గుర్రుగా ఉన్నట్టు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు