లాక్‌డౌన్‌తో కరోనా కట్టడి అసాధ్యం... రాహుల్ గాంధీ ఆవేదన

గురువారం, 16 ఏప్రియల్ 2020 (16:17 IST)
ప్రస్తుతం దేశంలో శరవేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు లాక్‌డౌన్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగపడదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, లాక్‌డౌన్‌తో కరోనా వైరస్‌ వ్యాప్తిని పూర్తిగా కట్టడి చేయలేమని జోస్యం చెప్పారు. 
 
"లాక్‌డౌన్ అనేది కేవలం వైరస్ తాత్కాలికంగా వ్యాప్తి చెందకుండా ఉండడానికి మనం వినియోగిస్తున్న తాత్కాలిక పద్ధతి మాత్రమే. లాక్‌డౌన్‌ ఎత్తివేయగానే కరోనా వైరస్‌ మళ్లీ విజృంభించి తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంది. కొన్ని రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించడమనేది కరోనాకు శాశ్వత పరిష్కారం కాదు" అని రాహుల్ ఆందోళన వ్యక్తంచేశారు.
 
"అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కరోనా నిర్ధారణ పరీక్షలను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది. మనముందున్న ఒకే ఒక మార్గం ఇదే. దేశంలో రెండు జోనులు ఏర్పాటు చేయాలి.. ఒకటి హాట్‌స్పాట్‌, మరొకటి నాన్‌ హాట్‌స్పాట్‌ జోన్. ఆ తర్వాత ఆయా జోనుల్లో పలు చర్యలు తీసుకోవాలి" అని చెప్పారు.
 
"ర్యాండమ్‌ పద్ధతిలో కరోనా వైద్య పరీక్షలు నిర్వహించాలి. కరోనా పరీక్షలు వ్యూహాత్మకంగా జరగట్లేదు. కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కరోనాకి లాక్‌డౌన్‌ పరిష్కారం కాదు. దినసరి కూలీలు, కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు" అని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. 
 
"చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రణాళికలు రచించాలి. దేశంలో ప్రస్తుతం చాలా తక్కువ మందికి పరీక్షలు చేస్తున్నారు. దీని సంఖ్యను భారీగా పెంచాల్సి ఉంది. ప్రజల ప్రాణాలను కాపాడాలి. అలాగే, మన దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమయ్యేలా చేయకూడదు" అని రాహుల్ అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు