నన్నూ.. నా భార్యను ఒక్కటి చేయలేదో... కొబ్బరి చెట్టుపై నుంచి దూకేస్తా...

శుక్రవారం, 18 డిశెంబరు 2020 (09:50 IST)
సాధారణంగా చిన్న కోర్కెలు తీర్చకపోతే భార్యామణులు అలకపాన్పునెక్తుతుంటారు. ముఖ్యంగా వారికి నచ్చిన నగలు లేదా చీరలు తీసివ్వకపోతే ఆ పని చేస్తుంటారు. కానీ, ఇక్కడో భర్త ఏకంగా కొబ్బరిచెట్టు ఎక్కేశాడు. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు. తననూ తన భార్యను ఒక్కటి చేయకపోతే.. కొబ్బరి చెట్టుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని మంకుపట్టాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రంలోని కూడ్లిగి తాలూకాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,  కర్ణాటకలోని కూడ్లిగి తాలూకాకు చెందిన 40 యేళ్ళ వయస్సున్న దొడ్డప్ప అనే వ్యక్తి భార్య ఆయన అలికి ఇంటికి వెళ్లిపోయింది. ఆమె ఎడబాటును తట్టుకోలేక పోయిన ఆయన.. తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. 
 
అంతే.. తననూ, తన భార్యను ఒక్కటి చేయాలంటూ మంకుపట్టాడు. ఇందుకోసం ఏకంగా కొబ్బరి చెట్టు ఎక్కి 8 గంటల పాటు కూర్చొని నానా హంగామా చేశాడు. చెట్టుపై కూర్చుని తననూ, తన భార్యనూ ఒకటి చేయడంలో మీరంతా విఫలమయ్యారని ఊరి జనంపై దుమ్మెత్తిపోశాడు.
 
తరచుగా గొడవలు జరగడంతో ఐదేళ్ల క్రితం దొడ్డప్ప, అతని భార్య విడిపోయారు. భార్య లేకుండా.. ఇంటినీ, ముగ్గురు కొడుకులను చూసుకోవడం తన వల్ల కావడం లేదని చెట్టుపై నుంచి దొడ్డప్ప ఊరి జనానికి చెప్పేశాడు. దొడ్డప్ప భార్యతో మాట్లాడి ఎలాగోలా ఇద్దరినీ కలుపుతామని ఊరి జనం హామీ ఇచ్చిన తర్వాతే అతను చెట్టుపై నుంచి కిందకు దిగాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు