కాపురానికి రాలేదని భార్య ముక్కు కొరికేసిన భర్త... ఎక్కడ?

మంగళవారం, 11 మే 2021 (08:30 IST)
కట్టుకున్న భార్య కాపురానికి రాకపోవడంతో భర్తకు పిచ్చిపట్టినట్టు అయింది. దీంతో ఆయనకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ కోపాన్ని నిగ్రహించుకోలేక పోయిన ఆయన.. భార్య ముక్కు కొరికేశాడు. ఈ దారుణం ముంబై మహానగరంలో జరిగింది. 
 
వివ‌రాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన విజేందర్ పాల్ (36), ప్రేరణ సైనీ (31) అనే దంపతులు ఉండగా, వీరికి 11 యేళ్ళ కుమార్తె వుంది. అయితే, ఇటీవల దంపతులిద్దరి మధ్య గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంద‌ని విజేందర్ అనుమానం పెంచుకున్నాడు. 
 
అప్పటి నుంచి ఆమెను వేధించ‌డం మొద‌లుపెట్టాడు. రోజురోజుకు భ‌ర్త వేధింపులు పెరిగిపోవ‌డంతో ప్రేరణ విసిగిపోయింది. అందుకే కూతురును వెంటబెట్టుకుని భర్తకు తెలియకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది.
 
ముంబైలోని బంధువుల ఇంటికి వెళ్లిన ప్రేరణను వెతుక్కుంటూ బయల్దేరిన విజేందర్ కూడా అక్క‌డికి చేరుకున్నాడు. ఇంటికి వెళ్దాం ర‌మ్మ‌ని భార్య‌ను కోరాడు. కానీ అత‌నితో వెళ్లేందుకు ఆమె అంగీకరించలేదు. 
 
బంధువుల ముందు కూడా భార్య త‌న మాట విన‌క‌పోవ‌డంతో కోపంతో ర‌గిలిపోయాడు. అందుకే ఆ ఇంటి ద‌గ్గ‌రే మాటువేసిన విజేందర్‌ పాల ప్యాకెట్ కోసం భార్య బ‌య‌టికి రాగానే ఆమెను అనుస‌రించాడు. దాంతో ఆమె ఆటో ఎక్కి పారిపోయేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. అదే ఆటోను వెంబ‌డించి ఎక్కిన విజేంద‌ర్ భార్య ముక్కు కొరికేసి పారిపోయాడు.
 
బలంగా కొరకడంతో ప్రేర‌ణ ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావమైంది. ఆమెను ఆస్ప‌త్రికి తరలించగా వైద్యులు 15 కుట్లు వేశారు. ఇదిలావుంటే భార్య ముక్కు కొరికి పారిపోతున్న విజేంద‌ర్‌ను స్థానికులు ప‌ట్టుకుని పోలీసులకు అప్ప‌గించారు. 
 
పోలీసులు విచారించ‌గా త‌న‌కు త‌న భార్య, పాప అంటే చాలా ఇష్టమని, వారిని విడిచి ఉండ‌లేన‌ని విజేంద‌ర్ చెప్పాడు. తాను కూతురు, భార్యతోనే తిరిగి ఢిల్లీకి వెళ్తాన‌ని, ర‌మ్మ‌ని ఎంత బ‌తిమాలినా విన‌క‌పోవ‌డంతోనే క్ష‌ణికావేశంలో ముక్కు కొరికాన‌ని తెలిపాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు