పెళ్లయిన స్త్రీ పరాయిపురుషుడుతో అశ్లీలంగా చాటింగ్ చేస్తే ఏ భర్త మాత్రం సహిస్తాడని మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రశ్నించింది. వివాహానంతరం భార్యాభర్తలు స్నేహితులుగా హుందాగా, గౌరవంగా వ్యవహరించాలని, శృతి మించితే అది మనోవేదనకు దారితీస్తుందని కోర్టు అభిప్రాయపడింది. దిగువ కోర్టు మంజూరు చేసిన విడాకులను సవాల్ చేస్తూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ జస్టిస్ వివేక్ రొసియా, జస్టిస్ గజేంద్ర సింగ్లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
స్నహితులతో సంభాషణ మర్యాదగా ఉండాలని, హద్దులు దాటితే అది దాంపత్య జీవితానికి చోటుచేస్తుందని కోర్టు అభిప్రాయపడింది. ఒక వేళ జీవిత భాగస్వామికి అభ్యంతరం ఉన్నప్పటికీ అలాంటి కార్యకలాపాలను కొనసాగిస్తే అది నిస్సందేహంగా మానసిక హింస కిందకు వస్తుందని కోర్టు స్పష్టం చేసింది.
కాగా, గత 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట మధ్య మనస్పర్థలు తలెత్తాయి. భార్య తన పాత ప్రియుళ్లతో అసభ్యంగా చాటింగ్ చేస్తోందని భర్త ఆరోపించగా, ఆమె వాటిని ఖండించింది. తన మొబైల్ హ్యాక్ చేసి తప్పుడు సందేశాలు సృష్టిస్తున్నారని ఆరోపించింది. అంతేకాకుండా, భర్త తన గోప్యతను ఉల్లంఘించాడని, రూ.25 లక్షలు కట్నం ఇవ్వాలని డిమాండ్ చేశాడని ఆరోపించింది.