ఆస్తిలో భార్యకు సగం.. రాణి - మోతీలకు సగం వాటా.. ఓ వ్యక్తి దాతృత్వం

గురువారం, 11 జూన్ 2020 (09:02 IST)
ఆ వ్యక్తికి మూగజీవులపై అపారమైన ప్రేమ ఉంది. అందుకే వాటి సంరక్షణార్ధం వాటికి ఏకంగా సగం వాటాను రాసిచ్చాడు. అలాగే, తన భార్యకు కూడా సగం వాటాను రాసిచ్చాడు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అక్తర్ ఇమామ్ అనే వ్యక్తి ఏసియన్ ఎలిఫెంట్ రిహాబిలిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ యానిమల్ ట్రస్ట్ చీఫ్ మేనేజరుగా పని చేస్తున్నాడు. 
 
12 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి రాణి, మోతీ అనే ఏనుగుల సంరక్షణను చూసుకుంటున్నాడు. అవి రెండు లేకపోతే జీవించలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పాడు. వేటగాళ్ల తుపాకీ దాడి నుంచి తనను ఒకసారి ఏనుగులు కాపాడాయని తెలిపారు. ఈ ఏనుగులు తన ప్రాణమని చెప్పుకొచ్చాడు. 
 
ఆస్తిలో సగ భాగాన్ని ఏనుగుల పేరిట రాసినందుకు తన భార్య, కొడుకు తనను వదిలి వెళ్లారని, గత పదేళ్ల నుంచి తనకు దూరంగానే ఉంటున్నారని తెలిపాడు. అంతేకాదు, తప్పుడు కేసు పెట్టి తనను జైలుకు కూడా పంపారని వాపోయాడు. అయితే, అదృష్టవశాత్తు కేసులు నిలవకపోవడంతో తాను విడుదలయ్యానని తెలిపాడు. 
 
అంతేకాకుండా, తన కొడుకు స్మగ్లర్లతో చేతులు కలపి ఏనుగును అమ్మేందుకు ప్రయత్నించాడని... అయితే, ఆ డీల్ సక్సెస్ కాలేదన్నాడు. ఏనుగుల కోసం తన ఆస్తిలో సగ భాగాన్ని రాశానని, మిగిలిన సగాన్ని భార్య పేరున రాశానని తెలిపాడు. 
 
తన తర్వాత ఏనుగులు అనాథలుగా మిగలరాదనే ఇలా చేశానని చెప్పాడు. ఒకవేళ ఏనుగులు మరణిస్తే.. ఆ ఆస్తి ఏఈఆర్ఏడబ్ల్యూఏటీ ట్రస్టుకు వెళ్లేలా వీలునామా రాశానని తెలిపాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు