అమృతకు ఒక్క పైసా కూడా ఇవ్వొద్దు... మారుతీ రావు వీలునామా?

మంగళవారం, 10 మార్చి 2020 (11:32 IST)
మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రియల్టర్ మారుతీ రావు ఇటీవల హైదరాబాద్ నగరంలోని ఆర్యవైశ్య సత్రంలో ఆత్మహత్య చేసుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ ఆత్మహత్య కేసులో మారుతీ రావు రాసిన వీలునామా పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
వీటిని ప్రణయ్ హత్య కేసు విచారణ సమయంలో కోర్టుకు సమర్పించనున్నారు. అలాగే, ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు మరణించడంతో, అతని పేరును తొలగించి, మిగతా వారిపై విచారణ కొనసాగించాల్సిందిగా పోలీసులు కోర్టును అభ్యర్థించనున్నారు.
 
అయితే, వీలునామా పత్రాల్లో తన కుమార్తె పేరు మీద ఒక్క పైసా కూడా మారుతీ రావు రాయలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. తానెంతగానో ప్రేమతో చూసుకున్న కుమార్తె, ఇక తన వద్దకు రాదని భావించిన మారుతీరావు కొంతకాలం క్రితమే తన వీలునామాను మార్చి రాశారు. 
 
తన యావదాస్తిలో సగం తమ్ముడు శ్రవణ్ పేరిట, మిగతాది భార్య గిరిజ పేరిట రాసిన ఆయన, దాన్ని రిజిస్టర్ కూడా చేయించారు. వీటి కాపీలు ఇప్పుడు పోలీసుల అధీనంలో ఉన్నాయి. కుమార్తె అమృత పేరిట ఆయన ఒక్క పైసా కూడా రాయలేదు. 
 
గతంలో అమృత భర్త ప్రణయ్ హత్య తర్వాత, తన ఆస్తిలో అధిక భాగాన్ని మారుతీ రావు కుమార్తె పేరిటే రాశారన్న సంగతి తెలిసిందే. ఆపై జరిగిన పరిణామాలు ఆయన తన వీలునామాను మార్చుకునేలా చేశాయని తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు