అంకుల్ మేమిద్దరం ఇష్టపడ్డాం... పెళ్లి చేయండి... : ఠాణాను ఆశ్రయించిన బాలికలు!!

వరుణ్

శుక్రవారం, 7 జూన్ 2024 (12:19 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహరాన్ పూర్‌లో ఓ విచిత్ర ఘటన జరిగింది. ఇద్దరు బాలికలు తమకు పెళ్లి చేయాలంటూ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. మేమిద్దరం ప్రేమించుకున్నాం.. ఒకరినొకరు ఇష్టపడ్డాం.. అందువల్ల మాకిద్దరికి పెళ్లి చేయాలంటూ వారు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సహరాన్‌పూర్‌కు చెందిన 14, 15 యేళ్ల వయసున్న ఇద్దరు బాలికలు చేతిలో చెయ్యేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. వారిని చూసిన పోలీసులు.. ఎందుకు వచ్చారు.. సమస్య ఏంటని ప్రశ్నించారు. దానికి ఆ బాలికలు చెప్పిన సమాధానం విని ఖాకీలో నిర్ఘాంత పోయారు. తామిద్దరం ప్రేమించుకున్నామని, ఒకరినొకరి విడిచి జీవించలేమని, దయచేసి తమకు పెళ్లి చేసి జీవితాంతం కలిసివుండేలా చూడాలని ప్రాధేయపడ్డారు. 
 
వారు చెప్పిన మాటలకు ఒకింత షాక్‌కు గురైన పోలీసులు.. వారిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అది సరికాదని, మీరింకా బాలికలేనని, సమాజం అంగీకరించదని నచ్చజెప్పే ప్రయత్నం చేసారు. అయినప్పటికీ వారు వినిపించుకోలేదు సరికదా... కాదంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. చివరికి ఇలా కాదని వారి తల్లిదండ్రులను పిలిపించిన పోలీసులు.. వారి సమక్షంలోనే మరో రెండు గంటల పాటు కౌన్సెలింగ్ ఇచ్చి బాలికలను ఒప్పించడంతో ఈ కథ సుఖాంతమైంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు