మేఘాలయ హనీమూన్ కేసు దర్యాప్తులో సరికొత్త విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా రాజా రఘువంశీ హత్యకు ఏకంగా మూడుసార్లు ప్లాన్ చేసి, నాలుగోసారి విజయం సాధించినట్టు తేలింది. ఈ హత్యకు పాల్పడింది కూడా రాజా భార్య సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ రఘువంశీలేనని, వీరు కిరాయి ముఠా సభ్యులతో కలిసి హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ దారుణ విషయాలను ఎస్పీ వివేక్ సియామ్ స్వయంగా వెల్లడించారు. నాలుగో ప్రయత్నంలో హంతకులు తమ ప్లాన్ను విజయవంతంగా అమలు చేసి, రాజా రఘువంశీని దారుణంగా హత్య చేశారని ఆయన వెల్లడించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరరకు.. రాజా రఘువంశీని హత్య చేయడానికి అనేక ప్రణాళికలు రచించారు. తొలుత గౌహతిలో హత్య చేసి, మృతదేహాన్ని ఎక్కడైనా పడేయాలని పథకం వేశారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ ప్లాన్ వాయిదా పడింది. ఆ తర్వాత మేఘాలయలోని సోహ్రా ప్రాంతంలో రెండోసారి హత్యకు ప్రయత్నించినా ఆ రెండుసార్లు కూడా విఫలమయ్యారు.
మొదట నంగ్రిట్ వద్ద హత్య చేసి మృతదేహాన్ని పారవేసేందుకు అనువైన ప్రదేశం దొరకకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆ తర్వాత మవ్లాఖియట్, వెయిసావ్డోంగ్ వద్ద కూడా ప్రయత్నించారు. రఘువంశీ వాష్రూమ్కు వెళ్లినపుడు హత్య చేయాలనుకున్నారు. ఆ ప్లాన్ కూడా సాధ్యపడలేదు. చివరకు వెయిసావ్డోంగ్ జలపాతం వద్ద రఘువంశీపై దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశారని ఎస్పీ వివరించారు.
సోనమ్, రాజా రఘువంశీలకు మే 11వ తేదీన వివాహం జరిగింది. ఆ తర్వాత ఈ జంట గౌహతిలోని కామాఖ్య అమ్మవారి ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్లారు. అయితే హంతకులు మే 19వ తేదీనే గౌహతికి చేరుకుని సిద్ధంగా ఉన్నారు. అక్కడ నుంచి సోనన్ షిల్లాంగ్, స్రోహా వెళ్లాలని నిర్ణయించుకోవడంతో హంతకులు గౌహతిలోనే తమ ప్రణాళికను రద్దు చేసుకుని సోనమ్ను అనుసరించి తమ ప్లాన్ను విజయవంతంగా అమలు చేశారు.