నాడు నిండు సభలో ప్రతిన.. నేడు కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ప్రమాణం!

వరుణ్

ఆదివారం, 9 జూన్ 2024 (20:30 IST)
నాడు నిండు సభలో ప్రతిన బూనిన శ్రీకాకుళం ఎంపి కె రామ్మోహన్ నాయుడు ఆదివారం కొలువుదీరిన ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అతి పిన్న వయస్కుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత పార్లమెంట్ సమావేశంలో ఓ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో తమకు మాట్లాడటానికి ఇంకాస్త సమయం కావాలని కోరారు. అయితే, అప్పటి పార్టీల సీట్ల సంఖ్య ప్రకారం ఆయనకు మాట్లాడే సమయం చాలా తక్కువగా ఇచ్చారు. సాధారణంగా ఎవరైనా రిక్వెస్ట్‌  చేసి మాట్లాడి ముగిస్తారు. కానీ రామ్మోహన్ నాయుడు మాత్రం అలా కాకుండా, 'వచ్చేసారి పార్లమెంట్‌కు తమ పార్టీ ఎక్కువ మెజారిటీతో వస్తుందని, అప్పుడు సమయం గురించి ఎలాంటి ఇబ్బంది ఉండదు' అని గట్టిగా చెప్పారు. ఆయన సంకల్ప బలమే ఇపుడు ఏకంగా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
 
తండ్రి దివంగత ఎర్రన్నాయుడు 2012 నవంబరు 2న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రామ్మోహన్‌ నాయుడు రాజకీయ రంగప్రవేశం చేశారు. 2014లో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సైకిల్‌యాత్ర చేసి, పార్టీ శ్రేణులకు, ప్రజలకు చేరువయ్యారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున తొలిసారి పోటీ చేసి 1.27 లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని 5 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ఓడిపోయినా తాను మాత్రం ఎంపీగా గెలిచి, పట్టు నిలబెట్టుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 3.27 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం ఆయన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా విధులు నిర్వహిస్తుండటం గమనార్హం 
 
రామ్మోహన్‌నాయుడి చిన్నాన్న అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు. సోదరి ఆదిరెడ్డి భవాని మొన్నటి వరకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఎన్నికల్లో ఆమె భర్త ఆదిరెడ్డి వాసు అక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందారు. రామ్మోహన్‌ భార్య శ్రావ్య తండ్రి బండారు సత్యనారాయణమూర్తి అనకాపల్లి జిల్లా మాడుగుల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.  
 
స్వస్థలం : నిమ్మాడ, కోటబొమ్మాళి మండలం, శ్రీకాకుళం జిల్లా
వయసు : 36 సంవత్సరాలు
విద్యార్హత : బీటెక్, ఎంబీఏ 
తల్లిదండ్రులు : విజయలక్ష్మి, ఎర్రన్నాయుడు 
భార్య : శ్రావ్య 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు