భక్తులకు శుభవార్త : ఛార్‌ధామ్ యాత్రపై నిషేధం ఎత్తివేత

గురువారం, 16 సెప్టెంబరు 2021 (15:29 IST)
హిందూ భక్తులకు ఉత్తరాఖండ్ హైకోర్టు శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చార్‌ధామ్ యాత్రపై అమలు చేస్తూ వచ్చిన నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు ఉత్తరాఖండ్ హైకోర్టు గురువారం ఆదేశాలు జారీచేసింది. అయితే దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యను పరిమితం చేయాలని సూచించింది. 
 
కొవిడ్-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ధామ్‌లను సందర్శించే భక్తులకు కరోనావైరస్ పాజిటివ్‌ రిపోర్టులు, రెండో డోసుల టీకా తీసుకున్న సర్టిఫికేట్‌ను తప్పనిసరి చేయాలని కోర్టు ఆదేశించింది. కరోనా మార్గదర్శకాలను పాటించేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని తెలిపింది.
 
చార్‌ధామ్‌ను సందర్శించేందుకు హైకోర్టు యాత్రికులను అనుమతించినప్పటికీ, ఆలయాలను సందర్శించే భక్తుల సంఖ్యపై రోజువారీగా పరిమితిని ఉత్తరాఖండ్ హైకోర్టు విధించింది. 
 
ముఖ్యంగా, కేదార్‌నాథ్ ఆలయంలో 800 మంది భక్తులు, బద్రీనాథ్ ఆలయంలో 1200 మంది, గంగోత్రిలో 600 మంది, యమునోత్రి ధామ్‌లో 400 మంది భక్తులను మాత్రమే అనుమతించాని హైకోర్టు తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు