బెంగాల్ సమరం : 10న నాలుగో విడత పోలింగ్.. 81 మంది నేరచరితులు

ఆదివారం, 4 ఏప్రియల్ 2021 (12:56 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ నెల 10వ తేదీన నాలుగో దశ పోలింగ్ జరుగనుంది. ఈ దశలో బరిలో ఉన్న 372 మంది అభ్యర్థుల్లో దాదాపు 22శాతం మంది తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ప్రకటించారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్‌) ఒక నివేదికలో పేర్కొంది. 
 
ఈ నెల 10న జరుగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న 373 మంది అభ్యర్థులో 372 మంది దాఖలు చేసిన నామపత్రాలను ఏడీఆర్‌ విశ్లేషించింది. అయితే, కేంద్రం ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉన్న అసంపూర్ణ అవిఫిడవిట్‌ కారణంగా సప్తగ్రామ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న స్వతంత్య అభ్యర్థి బిష్ణు చౌదరి రికార్డులు విశ్లేషించలేకపోయినట్లు పేర్కొంది.
 
372 మంది అభ్యర్థులు 81 మంది (22శాతం) అభ్యర్థులు తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ప్రకటించారని, 65 మంది (17)శాతం మంది అభ్యర్థులు తమపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నాయని వెల్లడించారని, మరో 65 మంది (17శాతం) తాము కోటీశ్వరులమని పేర్కొన్నట్లు ఏడీఆర్‌ నివేదిక పేర్కొంది. 
 
ప్రధాన పార్టీల్లో బీజేపీ నుంచి 27 మంది, కాంగ్రెస్‌కు చెందిన 9 మంది, తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి 17 మంది, ఎస్‌యూసీఐ(సీ) పార్టీ నుంచి ఒకరు తమ అఫిడవిట్లలో తమపై క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు ప్రకటించారని ఏడీఆర్‌ వివరించింది. 
 
19 మంది అభ్యర్థులు తమపై.. మహిళపై నేరారోపణలకు సంబంధించిన కేసులున్నట్లు ప్రకటించారు. నలుగురు అభ్యర్థులు తమపై అత్యాచార కేసులున్నట్లు తెలిపారు. 16 మంది అభ్యర్థులు తమపై హత్యాయత్నం కేసులున్నట్లు వెల్లడించినట్లు ఏడీఆర్‌ వివరించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు