దేవగౌడపై ప్రతీకారం తీర్చుకున్న కర్ణాటక గవర్నర్!

గురువారం, 17 మే 2018 (16:06 IST)
మాజీ ప్రధాని దేవెగౌడపై గుజరాత్ రాష్ట్రానికి చెందిన కర్ణాటక మాజీ గవర్నర్ వజుభాయ్ వాల్ ప్రతీకారం తీర్చుకున్నారు. అదీ 22 యేళ్ల నాటి ప్రతీకారం. దేవెగౌడ ప్రధాన మంత్రిగా ఉన్న వేళ, తనకు, తన పార్టీకి జరిగిన అన్యాయానికి ఇపుడు ప్రతీకారం తీర్చుకున్నారు. వివరాల్లోకి వెళితే...
 
1996లో ప్రధానమంత్రిగా దేవెగౌడ ఉన్నారు. అపుడు గుజరాత్ రాష్ట్రంలో సురేశ్ మెహతా నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పడిపోయింది. అప్పటికీ మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించిన వాజూభాయ్ వాలాకి, మెహతా ప్రభుత్వంలో తొలిసారిగా మంత్రి పదవి దక్కింది. 
 
ఇక ఆ సమయంలో బీజేపీ నుంచి 40 మంది ఎమ్మెల్యేలను విడగొట్టిన శంకర్ సింగ్ వాఘేలా, కాంగ్రెస్ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో గుజరాత్‌లో రాష్ట్రపతి పాలన పెట్టాలని రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మకు ప్రధానిగా దేవెగౌడ సిఫార్సు చేశారు. దీంతో గుజరాత్‌ ప్రభుత్వాన్ని రాష్ట్రపతి రద్దు చేశారు. ఫలితంగా వాజూభాయ్ మంత్రి పదవిని మూన్నాళ్ల ముచ్చటగా మార్చారు.
 
అప్పటి గవర్నర్ సైతం మెజారిటీ సీట్లున్న బీజేపీకి బదులు ఆర్జేడీ (వాఘేలా స్థాపించిన పార్టీ)ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఆ ప్రభుత్వం 1998 వరకూ కొనసాగగా, ఆ తర్వాతి కాలంలో వాజూభాయ్ ఎమ్మెల్యేగా గెలిచినా, మంత్రి పదవి దక్కలేదు. ఆ తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రిగా ఎన్నికయ్యారు. మోడీ మళ్లీ ప్రధాని అయ్యాక కర్ణాటక రాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. అలా నాడు దేవెగౌడ చేసిన పనికి, వజూభాయ్ వాలా నేడు ప్రతీకారం తీర్చుకున్నారని రాజకీయ విశ్లేషకులు గత జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు