గులాబీ వజ్రాన్ని ఎవరు దేశం దాటించారో? నాలాంటి అర్చకులను తొలగిస్తే?

ఆదివారం, 20 మే 2018 (16:27 IST)
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి రోజూ కానుకల వర్షం కురుస్తూనే వుంటుంది. భక్తులు స్వామికి కాసులు, వజ్రాలు, పసిడి, వెండి రూపంలో కానుకలు సమర్పిస్తుంటారు. ఈ కానుకల్లో తిరుమల శ్రీవారికి చెందిన అత్యంత విలువైన గులాబీ వజ్రం అంశంపై పూర్వ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ విలువైన గులాబీ వజ్రాన్ని ఎవరు దేశం దాటించారో తనకు తెలియదని రమణ దీక్షితులు తెలిపారు. తిరుమల శ్రీవారికి సంబంధించిన నగల గురించి కేవలం నలుగురు అర్చకులకు మాత్రమే తెలుసని చెప్పారు. తమబోటి ప్రధాన అర్చకులను తొలగిస్తే ఆ నగల గురించి అడిగే వారే వుండరనే ఆలోచనలో చాలామంది వున్నారని చెప్పారు. 
 
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీరు ఇలాగే ఉంటే, భవిష్యత్తులో తిరుమలలో ఓ దేవాలయం వుండేదని చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతుందని రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. స్వామివారి నగలకు సంబంధించిన వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయిస్తే అన్ని విషయాలు బయటపడతాయని చెప్పారు. 
 
అలాగే ఇటీవల పోటును మూసేయడంపై రమణ దీక్షితులు టీటీడీ తప్పుబట్టారు. నాలుగు బండలను తొలగిచండానికి 22 రోజుల పాటు పోటును  ఎందుకు మూసివేశారని ప్రశ్నించారు. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న కట్టడం భాగం పడగొట్టి, బండలు తొలగించాల్సిన అవసరమేమొచ్చిందని అడిగారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు