తితిదేలో అంతా మోసమే .. శ్రీవారి నగల కోసం వంటశాలను తవ్వేశారు : రమణ దీక్షతులు

శనివారం, 19 మే 2018 (12:07 IST)
ప్రసిద్ధ తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)లో చోటుచేసుకుంటున్న అవినీతి అక్రమాలపై ఆ ఆలయ ప్రధాన అర్చకులుగా పని చేసిన రమణ దీక్షితులు సంచలన విషయాలను వెల్లడిస్తున్నారు. ఈ విషయంలో ఆయనకు తితిదే ఈవో ఇప్పటికే నోటీసులు జారీచేశారు. అయినప్పటికీ.. ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు కదా మరికొన్ని అవకతవకలను ఆయన బహిర్గతం చేస్తున్నారు.
 
ఇదే అంశంపై ఆయన తాజాగా మాట్లాడుతూ, గత 2017లో వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన వంటశాలను ఏ ఒక్కరికీ సమాచారం ఇవ్వకుండా మూసివేశారన్నారు. ఈ కారణంగా 25 రోజుల పాటు శ్రీవారికి శుచిగాలేని నైవేద్యాన్ని పెట్టారని ఆయన ఆరోపించారు. ఆలయంలోని వంటశాల వద్ద భూకంపం వచ్చిన మాదిరి అక్కడ గోడలు, ఇటుకలు అన్నీ పడిపోయి ఉన్నాయని, వంటశాలను తవ్వారన్నదానికి ఇది నిదర్శనమన్నారు. పదో శతాబ్దంలో పల్లవులు, చోళులు స్వామివారికి సమర్పించిన ఆభరణాలను భూమి కింద వెతికినట్లు అక్కడి పరిస్థితులు స్పష్టం చేశాయన్నారు. 
 
మరోవైపు, 2001లో గరుడ సేవ సందర్భంగా స్వామివారికి సమర్పించిన ప్లాటినం హారంలో మధ్యన ఉండే గులాబీ రంగు వజ్రం భక్తులు విసిరిన నాణేల వల్ల పగిలిపోయిందని రికార్డు చేశారని, అయితే ఇటీవల జెనీవాలో అలాంటి వజ్రమే రూ.500 కోట్లకు అమ్ముడైందన్నారు. భక్తుల నాణేల తాకిడికి వజ్రం పగిలిపోయిందనడం అబద్ధమన్నారు. టీటీడీలో చోటుచేసుకుంటున్న లోటుపాట్లను బయటపెట్టినందుకు తనపై కక్ష తీర్చుకుంటున్నారని రమణ దీక్షితులు ఆరోపిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు