మెదక్ జిల్లా ఆ ఆలయంలోని కుండలోకి కాశీ నుంచి పుణ్యతీర్థం వస్తుంది...

శనివారం, 3 ఫిబ్రవరి 2018 (21:17 IST)
మెదక్ జిల్లా ఝరాసంగంలోని సంగమేశ్వరాలయంలోని కుండంలోకి నీళ్లు కాశి నుంచి వస్తాయని ప్రశస్తి. కుండంలో(కొలనులో) విడిచిన ప్రసాదం నీటికి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తుది. కన్నడిగుల ఇలవేలుపైన ఇక్కడి సంగమేశ్వడిని తెలుగు, కన్నడ, మరాఠీలూ భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. శివుడు భోళా శంకరుడు. హరహర మహదేవ అంటూ రాక్షసులు ప్రార్థించినా అభయమిచ్చి ఆదుకునే మహాదేవుడు. అడవి పూలతో పూజించినా అష్టైశ్వర్యాలు కలిగించే ఆదిదేవుడు. అందుకే ఝరాసంగమంలోని శివుడు మొగలి పూదోటలో వెలిశాడు.
 
శతబ్దాల చరిత్ర ఉన్న మెదక్ జిల్లా సంగమేశ్వరాలయానికి ఎంతో ప్రశస్తి వుంది. సాధారణంగా ఆలయానికి ముందు భాగంలో కొనేరు వుంటుంది. కానీ ఇక్కడ ఆలయానికి వెనుక భాగంలో కుండం వుంటుంది. కొలనులోకి ఝరా(నీటి ప్రవాహం) కాశీ నుంచి వస్తుందని భక్తుల నమ్మకం. అందుకే సంగమేశ్వరుడు వెలసిన ఈ గ్రామానికి ఝరాసంగం అనే పేరు వచ్చింది.
 
క్షేత్ర పురాణం...
పురాతనమైన ఈ దేవాలయానికి సంబంధించి ఓ గాథ ప్రచారంలో ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం భారతదేశాన్ని సూర్యవంశీయుడైన కుపేంద్ర రాజు పాలించేవాడు. ఆయన వైద్యానికి నయంకాని ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతుండేవాడు. ఒకరోజు సైనికులతో కలిసి వేటకు వెళ్ళిన ఆయన ఓ జంతువును వెంబడిస్తూ సంగమేశ్వర నివాస స్థానమైన కేతకీ వనానికి చేరాడు. దాహం తీర్చుకునేందుకు నీళ్ళకోసం వెతకగా కొంచెం దూరంలో ఆయనకు ఓ నీటి కుండం కనిపించింది.
 
నీళ్ళు త్రాగి సమీపంలో ఉన్న శివలింగాన్ని పరివారంతో కలసి దర్శించుకొని ఇంటికి చేరాడు. మరుసటి రోజు నిద్ర నుంచి లేచిన రాజును చూసి ఆయన భార్య చంద్రకళా దేవి ఆశ్చర్యపోయింది. ఆయన వ్యాధి నయం అయిపోయిందట. ఇదంతా కేతకి వనంలోని శివుడు మహిమే అనుకొని కుపేంద్రుడు కుటుంబ సమేతంగా మహాశివుడిని దర్శించుకున్నాడు. ఆ సమయంలో దేవర్షి నారదుడు వైకుంఠం నుంచి ఆకాశ మార్గం ద్వారా వెళ్తూ భువిపైన స్నానమాచరించేందుకు కుండం దగ్గరకి వచ్చాడు. ఆయనకు నమస్కరించిన కుపేంద్ర రాజు అక్కడ శివలింగం విశేషాలను తెలుసుకుంటాడు. 
 
బ్రహ్మదేవుడు జ్ఞాన సముపార్జనకు అనువైన స్థలము కోసం వెతుకుతుండగా అత్యంత ఆహ్లాదకరమైన కేతకీ వనం ఆయన దృష్టిని ఆకర్షించింది. బ్రహ్మదేవుడు ఆ వనంలో శివుడు కోసం తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయనతో పాటు అక్కడ శివలింగం ఆవిర్భవించింది. బ్రహ్మదేవుడు ఆ లింగానికి పూజలు చేసి అక్కడ కొలనులో ప్రతిష్టించారు అని వివరించాడు నారదుడు. శివబ్రహ్మల సంగమ స్థానం కావడం చేత దీనిని సంగమ క్షేత్రం అని అంటారు. ఇక్కడ వెలసిన శివుడికి సంగమేశ్వరుడని పేరొచ్చింది. ఇక్కడ శివుడిని మొగలిపూలతో పూజించడం ప్రత్యేకత. ఆ పూలతో పూజించడం వల్ల మనసులోని కోరికలు నెరవేరుతాయని అక్కడి ప్రజల విశ్వాసం. 
 
ఈ ఆలయ ప్రత్యేకతలు ఏంటంటే నైరుతి దిశ నుండి జలధార వస్తుంది. ఇక్కడ ప్రజలు పూజానంతరం ప్రసాదాలను విస్తరాకుల్లో పెట్టి నీటిలో వదులుతారు. ప్రసాదం నీటికి ఎదురీదుకుంటూ వెళ్తుంది. ప్రసాదం మాత్రమే నీటిలోనికి వెళ్ళి విస్తరాకులు బయటకు వస్తాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు