కోదండరామస్వామివారి ఆలయంలో.. ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం..

శుక్రవారం, 25 అక్టోబరు 2019 (16:56 IST)
తిరుపతిలోని కోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో ఈ నెల 27న దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. 
 
ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 6.00 నుండి 9.00 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి, పసుపు, కుంకుమ, చందనం, సీకాయ, నామం, కర్పూరం, కిచిలిగడ్డ, కస్తూరి పసుపు, పచ్చాకు తదితరాలతో తయారు చేసిన సుగంధద్రవ్యాన్ని గర్భాలయ గోడలకు పూశారు. 
 
అనంతరం ఉదయం 9.30 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవో శాంతి, ఏఈవో తిరుమలయ్య, సూపరింటెండెంట్‌ ర‌మేష్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు. కోదండ రామాలయంలో దీపావళి సందర్భంగా ఈ నెల 27వ తేదీ ఆదివారం రాత్రి 7.00 గంటలకు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీకోదండరామ స్వామివారికి సమర్పిస్తారు. 
 
అనంతరం ఆలయంలో దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమావాస్యనాడు ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహన సేవల‌ను టిటిడి రద్దు చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు