శ్రీవారికి ఏమాత్రం పనికిరాని భూములు విక్రయిస్తే తప్పేంటి : వైవీ సుబ్బారెడ్డి

ఆదివారం, 24 మే 2020 (13:59 IST)
శ్రీవారికి ఏమాత్రం పనికిరాని భూములను విక్రయిస్తే తప్పేంటని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. ఈ భూముల విక్రయంపై విపక్షాలు రాద్దాంతం చేయడం ఏమాత్రం తగదన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)కు ఉన్న భూములను విక్రయించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. దీనిపై ఏపీలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆలయ భూముల జోలికెళ్తే ఉద్యమం తప్పదని హెచ్చరికలు చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. విక్రయించాలని చూస్తున్న 50 ఆస్తులు ఆలయానికి ఏ మాత్రమూ ఉపయోగపడవని, అవి అన్యాక్రాంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 
 
టీటీడీకి మేలు కలిగించేందుకే ఈ ఆలోచన చేశామని, ఆస్తుల విక్రయం, లీజు అధికారాలు బోర్డుకే ఉంటాయని, ప్రభుత్వానికి ఈ నిర్ణయాలతో సంబంధం లేదని స్పష్టంచేశారు. 1974 నుంచి 2014 మధ్య మొత్తం 129 ఆస్తులను వేలం విధానంలో టీటీడీ అమ్మిందని గుర్తు చేసిన వైవీ సుబ్బారెడ్డి, చదలవాడ కృష్ణమూర్తి టీటీడీ ఛైర్మన్‌‌గా ఉన్న సమయంలోనే 2015 జూలై 28న 84వ నంబర్ తీర్మానం ద్వారా బోర్డుకు ఉపయోగపడని ఆస్తులను గుర్తించి, విక్రయించే అవకాశాలు పరిశీలించేందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. 
 
ఆ కమిటీ నివేదిక మేరకు 2016, జనవరి 30న చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన సమావేశమైన పాలక మండలి నిరర్దక ఆస్తుల బహిరంగ వేలానికి ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఇందులో భాగంగా తమిళనాడులోని 23 ఆస్తులు, ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 17 ఆస్తులు, పట్టణాల్లోని 9 ఆస్తులను విక్రయించాలని నాలుగేళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నారని, వాటి విలువను కూడా సేకరించి, బోర్డుకు రిపోర్ట్ చేశారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు