తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 75 శాతం హాజరువున్న డిగ్రీ విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయనుంది. ఈ మేరకు విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై డిగ్రీలో 75 శాతం హాజరుశాతం లేకుంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వరాదని వీసీల భేటీ నిర్ణయించారు.
రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏడు సంప్రదాయ వర్శిటీల వీసీల సమావేశం గురువారం జరిగింది. ఇందులో డిగ్రీలో కనీసం 75 శాతం హాజరులేకుండా ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హత లేదని గతంలోనే ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయన్నారు. కానీ, అవి అమలు కావడం లేదని ఉపకులపతులు చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు.
దీంతో ఈ సారి మాత్రం ఆ నిబంధనలను తప్పకుండా అమలు చేయాలని వీసీలకు చైర్మన్ బాలకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. దీంతో కొంతమేరకు విద్యాప్రమాణాలు పెరగడంతో పాటు విద్యార్థుల హాజరు శాతం కూడా గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. అలాగే, మూడేళ్ల డిగ్రీకి 150 క్రెడిట్లు ఉండగా, వాటిని 142కు కుదించాలని నిర్ణయించారు.