తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం, సంగుపేట గ్రామ శివారులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టపాసులు ప్యాకింగ్ పేపర్ల వ్యర్థాల్లో ప్రమాదవశాత్తు నిప్పు రవ్వ పడటంతో మంటలు చెలరేగి ఈ దుర్ఘటన జరిగింది. కటకం వేణుగోపాల్ అండ్ సన్స్ హోల్సేల్ అండ్ రిటైల్ టపాసుల దుకాణంలో ఈ ప్రమాదం సంభవించింది.
గోదాం ఆవరణలో ఏర్పాటు చేసిన హోల్సేల్ అండ్ రిటైల్ దుకాణాలకు మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతోపాటు దట్టమైన పొగలు అలుముకోవడతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీనిపై వెంటనే స్పందించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.