ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమించలేదు.. పక్కా పట్టా స్థలం : హీరో నాగార్జున

ఠాగూర్

సోమవారం, 26 ఆగస్టు 2024 (09:01 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని తుమ్మిడికుంట చెరువు స్థలాన్ని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని ఆరోపిస్తూ ఆ భవనాన్ని హైడ్రా కూల్చివేసింది. దీనిపై హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. ఒక్క అంగుళం స్థలాన్ని కూడా ఆక్రమించలేదని, ఎన్ కన్వెన్షన్ నిర్మాణం పక్కా పట్టా భూమిలోనే చేపట్టామని తెలిపారు. ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నామని ఆయన మరోమారు స్పష్టం చేశారు. తాము ఎలాంటి భూ ఆక్రమణలకు పాల్పడలేదని, అక్రమ నిర్మాణం చేపట్టలేని పునరుద్ఘాటిస్తూ, ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
 
"ప్రియమైన అభిమానులకు, శ్రేయోభిలాషులకు... సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలంటే చాలు... వాటికి అతిశయోక్తులు జోడిస్తుంటారు, మరింత ప్రభావంతంగా ఉండేందుకు ఊహాగానాలు ప్రచారం చేస్తారు. మరోసారి చెబుతున్నా... ఎన్ కన్వెన్షన్‌ను పట్టా భూమిలోనే నిర్మించాం. అన్ని డాక్యుమెంట్లు ఉన్న భూమి అది. ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించలేదు. తుమ్మిడికుంట చెరువులో ఎలాంటి భూ ఆక్రమణలు జరగలేదని ఏపీ భూ సేకరణ చట్టం స్పెషల్ కోర్టు 2014 ఫిబ్రవరి 24న తీర్పు (ఎస్సార్. 3943/2011) వెలువరించింది. ఇప్పుడు హైకోర్టులో కూడా ప్రాథమిక వాదనలు వినిపించాం. నేను భూ చట్టానికి, తీర్పునకు కట్టుబడి ఉంటాను. అప్పటివరకు ఎలాంటి ఊహాగానాలు, పుకార్లు, వాస్తవాల వక్రీకరణ, తప్పుదారి పట్టించడం వంటి చర్యల జోలికి వెళ్లొద్దని మిమ్మల్నందరినీ సవినియంగా కోరుతున్నాను" అని పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు