‘గూగుల్ పే’ కస్టమర్ కేర్ అంటూ గాలం.. రూ. 50 వేలు మాయం

సోమవారం, 13 జులై 2020 (20:59 IST)
సాధారణ పౌరులే కాదు పోలీసులునూ సైబర్ మోసగాళ్లు వదలడం లేదు. ఏకంగా ఓ సైబర్ నేరస్థుడు కానిస్టేబుల్‌నే మాయ చేసి సొమ్ము కాజేసిన ఘటన తాజాగా హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది.

తను ‘గూగుల్ పే’ ప్రతినిధినంటూ సదరు కానిస్టేబుల్‌ను నమ్మించి పిన్ నెంబరు తెలుసుకుని 50 వేల రూపాయలు కొట్టేసాడు. అకౌంట్ నుంచి రూ.50 వేలు మాయం కావడంతో మోసపోయానని తెలుసుకున్న కానిస్టేబుల్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.
 
వివరాలు పరిశీలిస్తే తనకు డబ్బు అవసరం ఉందని స్నేహితుడు కోరడంతో హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ జనార్దన్ గౌడ్ గూగుల్ పే ద్వారా రెండు దఫాలుగా 50 వేలు  పంపించాడు. మొదట దఫాగా 30,000, రెండో దఫాగా 20,000 ట్రాన్స్‌ఫర్ చేశాడు. అయితే  మొదట చేసిన ట్రాన్సాక్షన్ సక్సెస్‌పుల్ అని వచ్చి స్నేహితుడు అకౌంట్‌కు క్రెడిట్ అయింది.
 
కానీ రెండో ట్రాన్సాక్షన్ రూ. 20,000 సాంకేతిక కారణాల వల్ల సాధ్యం కాలేదంటూ సందేశం వచ్చింది. అయితే కానిస్టేబుల్ జనార్థన్ గౌడ్ అకౌంట్ నుంచి రూ. 20 వేలు డెబిట్ కావడంతో గూగుల్ పే కస్టమర్ కేర్ నంబర్ సేకరించి వివరాలు అడిగాడు. అయితే కొద్దిసేపటికే మరో నంబర్ నుంచి కానిస్టేబుల్‌కు ఫోన్ వచ్చింది.
 
తను గూగుల్ కస్టమర్ ప్రతినిధినని మీ డబ్బు వెనక్కి వస్తుందంటూ భరోసా ఇచ్చారు. అయితే అందుకు గూగుల్ పే నంబర్, పిన్ నంబర్ వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అంతే అకౌంట్ నుంచి 50 వేలు డెబిట్ అయినట్టు కానిస్టేబుల్ ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. వెంటనే తాను సైబర్ నేరగాడి వలలో పడ్డానని తెలుసుకున్న కానిస్టేబుల్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు