సంఘవికి వెన్నెముకపై తీవ్ర గాయాలు.. త్వరలోనే ఆపరేషన్.. ఏఐజీ ఛైర్మన్ వెల్లడి

మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (13:41 IST)
హైదరాబాద్ నగరంలోని ఎల్పీ నగర్‌కు చెందిన సంఘవి అనే యువతిపై  ప్రేమోన్మాది శివకుమార్‌ దాడి చేయగా, ఆమె తీవ్రంగా గాయపడి గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో చికిత్స పొందుతుంది. ఈ దాడిలో సంఘవి ముఖం, వెన్నెముకతోపాటు ఇతర ప్రాంతాల్లో బలమైన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ముఖంపై సర్జరీ చేసి కుట్లు వేసినట్లు చెప్పారు. 
 
ఆదివారం ఎల్బీనగర్‌లో దాడికి గురైన ఆమె ఆరోగ్యంపై సోమవారం ఏఐజీ హెల్త్‌బులెటిన్‌ను విడుదల చేసింది. ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి వీడియో సందేశం విడుదల చేశారు. 'క్రూరమైన దాడి కారణంగా గర్భాశయ ప్రాంతానికి సమీపంలో సంఘవి వెన్నెముకకు తీవ్ర గాయమైంది. ఈ గాయం కారణంగా ఆమె మంచానికే పరిమితమయ్యే ముప్పు పొంచి ఉంది. త్వరలో న్యూరోసర్జన్ల బృందం ఆధ్వర్యంలో ఈ గాయానికి శస్త్ర చికిత్స నిర్వహిస్తాం. ఆమె ఆరోగ్యాన్ని పూర్తి స్థాయిలో కాపాడటానికి మా వైద్యులు కృషి చేస్తున్నారు' అని డా.నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. 
 
అలాగే ఈ గాయాలు ఆమెను జీవితాంతం వేధించకుండా తగిన చికిత్సలు అందజేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. మానవీయ కోణంలో ఆమె చికిత్సకు అయ్యే ఖర్చులు ఏఐజీ భరిస్తుందన్నారు. డిశ్చార్జి అయిన తర్వాత కూడా ఆమెకు అన్ని రకాలుగా సాయం అందిస్తామన్నారు. ముఖ్యంగా ఈ సంఘటన యువత మానసిక ఆరోగ్యంపై ఆందోళన కలిగిస్తోందని డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి అన్నారు. ఆధునిక సమాజంలో ఇలాంటి నేరాలకు చోటు ఉండకూడదన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడే వ్యక్తులపై నిరంతరం ఓ కన్నేసి ఉంచాలని ఆయన పిలుపునిచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు