"పుష్ప" కోసం ఫోక్ సాంగ్స్‌పై దృష్టిపెట్టిన 'లెక్కల మాస్టారు'

గురువారం, 14 మే 2020 (10:31 IST)
లెక్కలు మాస్టారుగా గుర్తింపు పొందిన దర్శకుడు సుకుమార్. ఈయన "రంగస్థలం" చిత్రం తర్వాత మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. చిత్రం పేరు "పుష్ప". గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ఆర్య వచ్చింది. అది ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఈ కొత్త ప్రాజెక్టుపై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
అయితే, ఈ పుష్ప చిత్ర కథ మొత్తం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కొనసాగుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, గూడెం ప్రజలు మధ్య ఈ కథ సాగనుంది. అందుకే ఈ చిత్రంలో ఎక్కువగా ఫోక్ సాంగ్స్‌ను పెట్టాలన్న తలంపులో దర్శకుడు ఉన్నట్టు సమాచారం. ఈ అంశంపై కూడా సుకుమార్ వర్క్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
అడవి నేపథ్యంలో కలప అక్రమరవాణా ప్రధానంగా సాగే ఈ కథలో అడవి పరిసర ప్రాంతాల్లోని గిరిజన గూడాలను కలుపుకుంటూ ముందుకుసాగనుంది. దీంతో ఈ సినిమాలో జానపదగీతాల శాతం ఎక్కువగా కనిపిస్తుందని అంటున్నారు. గూడెం ప్రజలు .. నాయకా నాయికల మధ్య చోటుచేసుకునే ఈ జానపద గీతాలు హుషారెత్తిస్తాయని చెబుతున్నారు. 
 
దాంతోపాటు బన్నీ క్రేజ్‌ను, ఆయన నుంచి అభిమానులు ఆశించే స్టెప్స్‌ను దృష్టిలో పెట్టుకుని దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ సిద్ధం చేస్తున్నట్టు వినికిడి. పైగా, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు, హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందుకే బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచిని కూడా దృష్టిలో పెట్టుకుని, డాన్స్, ఫైట్స్ విషయంలో సుకుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడని ఫిల్మ్ వర్గాల సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు