తల్లిదండ్రులపై కేసు పెట్టిన తమిళ హీరో విజయ్

ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (16:27 IST)
కోలీవుడ్ అగ్రహీరో విజయ్ తన తల్లిదండ్రులపై కేసు పెట్టారు. అలాగే, మరో 11 మందిపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండానే తన పేరును వాడుకుంటూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు చెన్నై సిటీ సివిల్ కోర్టులో ఆయన ఓ పిటిషన్ దాఖలు చేసినట్టు ఆదివారం వెలుగులోకి వచ్చింది. 
 
ఇటీవల విజయ్ తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్ ఓ పార్టీని స్థాపించారు. అయితే, ఈ పార్టీ ప్రచారం కోసం తన పేరును అనుమతి లేకుండా వాడుకుంటున్నారన్నది విజయ్ ఆరోపణ. తన తండ్రి చంద్రశేఖర్ స్థాపించిన పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. 
 
దీంతో తన తల్లిదండ్రులతో సహా మొత్తం 11 మందిపై చెన్నై సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనుమతి లేకుండా తన పేరును ఉపయోగిస్తున్నారంటూ పేర్కొన్నారు. ఇకముందూ తన పేరుతో ఎలాంటి కార్యక్రమాలు, మీటింగ్స్ నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 17వ తేదీన జరుగనుంది. 
 
కాగా, గత ఏడాది విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్​ఏ చంద్రశేఖర్ ‘ఆల్ ఇండియా తళపతి విజయ్ మక్కల్ ఇయ్యకమ్’ పేరుతో రాజకీయ పార్టీ స్థాపించారు. దీనికి ఆయన ప్రధానకార్యదర్శిగాను, తల్లి శోభా చంద్రశేఖర్ కోశాధికారిగా ఉన్నారు. మరికొంతమందికి ఇతర పదవులను అప్పగించారు. 
 
అయితే, పార్టీ పెట్టిన కొన్నిరోజులకే విజయ్ వైపు నుంచి ఓ ప్రకటన వచ్చింది. 'మా నాన్న పెట్టిన పార్టీతో నేరుగా, పరోక్షంగా గానీ నాకు సంబంధం లేదు. మా నాన్న పార్టీ పెట్టారని నా ఫ్యాన్స్ ఎవరూ అందులో చేరొద్దు' అని పేర్కొన్నారు. అలాగే, పార్టీ కోసం తన పేరు, ఫొటో, ఫ్యాన్స్​ క్లబ్​నుగానీ దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటానని కూడా విజయ్ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు