వెండితెర ప్రాభవం ఇక ముగిసినట్టేనా? ఓటీటీ వైపు హీరోల మొగ్గు...

సోమవారం, 31 ఆగస్టు 2020 (11:55 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. మార్చి నెలాఖరు నుంచి మూసివేసిన ఈ థియేటర్లు.. ఇకపై ఎపుడు తెరుచుకుంటాయో కూడా తెలియదు.

ముఖ్యంగా, కరోనా వైరస్ కారణంగా ఏసీ థియేటర్లు, మాల్స్‌లో ఉండే మల్టీప్లెక్స్ థియేటర్ల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిపోయింది. పైగా, కరోనా వైరస్ దెబ్బకు ఇపుడు ప్రేక్షకుడు కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్‌కు వెళ్లి సినిమా చూసే అవకాశాలు కనుచూపు మేరలో లేవు.

ఈ కారణంగా అనేక మూవీ థియేటర్లు మూతపడే పరిస్థితికి వచ్చాయి. మున్ముందు కూడా కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గని పక్షంలో థియేటర్లన్నీ మూసివేయాల్సిన పరిస్థితి తప్పక వస్తుంది. ఇదే జరిగితే వెండితెర ప్రాభవం పూర్తిగా కనుమరుగైపోయినట్టే. 
 
పైగా, కరోనై పుణ్యమాని ఇపుడు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఊపందుకుంది. కరోనా లాక్డౌన్ కారణంగా ప్రజలంతా తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. ఇందులో సినీ ప్రేక్షకులంతా ఓటీటీలో సినిమాలకు అలవాటయ్యారు. 
 
సాధారణంగా ఒక ఫ్యామిలీ థియేటర్‌లో సినిమాకు వెళ్లాలంటే సగటున వెయ్యి రూపాయలు వెచ్చించాల్సిందే. కానీ ఇప్పుడు మూడు వందల రూపాయాలు వెచ్చిస్తే అమెజాన్ వంటి ఓటీటీ సంస్థ ఓ సంవత్సరం మెంబర్‌షిప్ ఇస్తుంది.

ఇక పిల్లల ఆన్‌లైన్ తరగతుల కోసం, వర్క్‌ఫ్రమ్ హొమ్ కోసం ఇంటర్‌నెట్ కనెక్షన్ తప్పనిసరి.. ఇంకేముంది సులువుగా ఇంట్లోనే థియేటర్ ప్రత్యక్షమవుతుంది.
 
కొత్త కొత్త సినిమాలు కుటుంబంతో కలిసి ఇష్టం వచ్చినప్పుడు ఓటీటీలో వీక్షించే వెసులుబాటు వచ్చేసింది. దీంతో భవిష్యత్‌లో కరోనా భయం వీడి థియేటర్లు ఓపెన్ అయినా ప్రేక్షకులు వచ్చేది సందేహమే. 
 
అలాంటి వారు థియేటర్‌కు కదిలి రావాలంటే టాప్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్‌బాబు, రామ్‌చరణ్, విజయ్ దేవరకొండ, రవితేజ, ఇలాంటి హీరోల వల్లనే సాధ్యమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. 
 
ఇక మిగిలిన హీరోలందరూ ఓటీటీ హీరోలుగా మిగిలిపోవాల్సిందేనని ట్రేడ్‌వర్గాలు అంటున్నట్లుగా తెలిసింది. ఏది ఏమైనా కరోనా ప్రభావంతో సినీ పరిశ్రమలో బాగానే మార్పులు రాబోతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు