ప్రభుత్వం టీవీ రంగానికి సంపూర్ణంగా అండగా ఉంటుంది : శ్రీనివాస్ యాదవ్

గురువారం, 16 ఫిబ్రవరి 2023 (18:37 IST)
Srinivas Yadav, Telugu Television Federation team
యూసఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను టెలివిజన్ ఫెడరేషన్ లోని అన్ని విభాగాల వారు కలిసి సమన్వయంతో ముందుగానే అంటే ఫిబ్రవరి 16న ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన కార్యక్రమాలు సాయంత్రం వరకు పాటలు, నృత్యాలు మిమిక్రీ, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి కేసీఆర్ గారికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
 
సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలను గుర్తు చేస్తూ రాసిన పాట చాలా బాగుంది. రచయిత వెనిగళ్ళ రాంబాబుకి, సంగీత దర్శకులు ఖుద్దూస్ కి, గాయకుడు ధనుంజయ్ కి అభినందనలు. పాటలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలను చాలా బాగా హైలెట్ చేశారు. ఈరోజు టీవీ సీరియల్స్ చూడని ఇల్లాలు లేదు. ఈరోజు టెలివిజన్ రంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తెలుగు భాషలోనే అధిక సంఖ్యలో సీరియల్స్ నిర్మాణం జరుగుతున్నట్లు తెలుస్తోంది. టీవీ రంగంలో వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. వారిలో అర్హులైన వారందరికీ ఆరోగ్య శ్రీ, కళ్యాణ లక్ష్మి పథకాలన్నీ ఏర్పాటు చేస్తాం. టీవీ ఫెడరేషన్ వారు ప్రభుత్వాన్ని టీవీ నగర్, టీవీ భవన్ కావాలని కోరుతున్నారు. అవి ఇచ్చే సందర్భం కూడా త్వరలోనే వస్తుంది. ప్రభుత్వం టీవీ రంగానికి సంపూర్ణంగా అండగా ఉంటుంది" అన్నారు.
 
  జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ గారు కళాకారుల పట్ల, కార్మికుల పట్ల, పేదల పట్ల ఎంతో సానుకూలంగా ఉంటారు. అన్ని నెరవేరుతాయి. ఆ సమయం వస్తుంది" అన్నారు.
 
 తెలంగాణ FDC చైర్మన్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. "టీవీ రంగంలో నాగబాల సురేష్ గారు, కే.రాకేష్ గారు, విజయ్ కుమార్ గారు ఇతర సభ్యుల నాయకత్వంలో త్వరలోనే వారు అనుకున్నది సాధిస్తారు. వారు నన్ను కలిసినప్పుడు ఎన్ని సీరియల్స్ నిర్మాణం జరుగుతున్నాయి. ఎన్ని వేలమంది టీవీ రంగం ద్వారా ఉపాధి పొందుతున్నారు.. టీవీ రంగం నుంచి  ఏటా కొన్ని కోట్ల  రూపాయలు ప్రభుత్వానికి టాక్స్ రూపంలో అందుతుంది అన్న విషయాల్ని నాకు తెలియజేశారు. ఎఫ్ డి సి వైపు నుంచి టీవీ నగర్ కోసం ఏం చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తాం అన్నారు.
 
 తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నాగబాల సురేష్ మాట్లాడుతూ.. "టీవీ లేని ఇల్లు లేదు కానీ టీవీ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు, కళాకారులకు చాలా మందికి ఇళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. వారికి ప్రభుత్వం సహకరించి టీవీ నగర్ ఏర్పాటు చేసి, ఇళ్లు కట్టించాలి అని విజ్ఞప్తి చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, అలాగే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, సముద్రాల వేణుగోపాల చారి టీవీ నగర్ విషయంలో ఎంతో సానుకూలంగా స్పందిస్తున్నారు. వారు టీవీ నగర్ గురించిన విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకు వెళ్తారు. మన టీవీ ఫెడరేషన్ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు అవసరమైన సందర్భాల్లో ప్రభుత్వ అధికారులను కలిసి మన టీవీ నగర్ విషయంగా చేయవలసిన టువంటి విజ్ఞప్తులను మనం చేస్తూ ఉండాలి. ప్రభుత్వ పెద్దల సహకారంతో, అధికారుల సహకారంతో, మన ఫెడరేషన్ సభ్యుల సహకారంతో త్వరలోనే మనం టీవీ నగర్ ని సాధించుకుందాం'' అన్నారు.
ఇంకా శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు,  శాసన మండలి సభ్యులు పురాణం సతీష్,  టెలివిజన్ ఫెడరేషన్ అధ్యక్షులు కే రాకేష్ తదితరులు మాట్లాడారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు