కోలీవుడ్‌లో కలకలం.. హీరో విశాల్ ఇంటిపై జీఎస్టీ నిఘా బృందం తనిఖీలు

మంగళవారం, 24 అక్టోబరు 2017 (05:47 IST)
కోలీవుడ్‌లో కలకలం రేగింది. తమిళనాడు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు, హీరో విశాల్ కార్యాలయంలో వస్తు సేవల పన్ను నిఘా విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఈ తనిఖీలు జరపడానికి బలమైన కారణం లేకపోలేదు. 
 
ఇటీవల హీరో విజయ్ నటించి "మెర్శల్" చిత్రంలో జీఎస్టీ విధానానికి వ్యతిరేకంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. వీటిపై తమిళనాడు బీజేపీ శాఖ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. 
 
పైగా, ఈ చిత్రం పైరసీ వీడియోను తిలకించి ఈ డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండే రాజకీయ నేతలు పైరసీ సీడీని చూడటాన్ని కోలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఏకతాటిపైకి వచ్చింది. 
 
ఈనేపథ్యంలో విశాల్‌కు చెందిన చెన్నైలోని సినీ నిర్మాణ సంస్థపై వస్తు సేవల పన్ను ఇంటెలిజెన్స్ అధికారులు సోమవారం మధ్యాహ్నం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక వడపళనిలోని విశాల్ ఫిల్మ్ కంపెనీలో సోదాలు జరగడంతో ఒక్కసారి తమిళ సినీపరిశ్రమలో కలకలం రేగింది. 
 
జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చాక ఈ తరహా దాడులు జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. జీఎస్టీ ఇంటెలిజెన్స్ టీమ్ సోదాలు నిర్వహించడం పట్ల సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. విశాల్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు