#JusticeforJayapriya ట్రెండ్ ఐతేనే పట్టించుకుంటారా? (video)

శుక్రవారం, 3 జులై 2020 (12:02 IST)
Sai pallavi
లాకప్ డెత్‌లో తండ్రీకొడుకులు మృతి మరచిపోకముందే ఇప్పుడు చిన్నారి జయప్రియ రేప్ అండ్ మర్డర్ తమిళనాట సంచలనంగా మారింది. దీనిపై సినీనటి సాయి పల్లవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే.. ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు అతి క్రూరంగా చంపేశారు. తమిళనాడు రాష్ట్రం పుదుక్కోట్టైలో ఇది చోటుచేసుకుంది 
 
పుదుక్కోట్టై జిల్లా ఎంబాల్ గ్రామంకి చెందిన జయప్రియ అనే ఏడేళ్ల బాలిక రెండో తరగతి చదువుతుంది. జూలై ఒకటో తేదీ అంటే బుధవారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. కంగారు పడిన తల్లిదండ్రులు పోలీసులకు కంప్లయింట్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గ్రామం చివర.. ముళ్ల పొదళ్లలో గుర్తించారు. 
 
పోస్ట్‌మార్టంలో చిన్నారిని అత్యాచారం చేసి.. హత్య చేసినట్లు నిర్థారణ అయ్యింది. దీంతో తమిళ ప్రజల ఆగ్రహజ్వాలలు మొదలయ్యాయి. #JusticeForJayapriya అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో హోరెత్తిస్తూ ఆమెకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు
 
దక్షిణ బ్యూటీ సాయి పల్లవి కూడా దేశంలో జరిగిన భయంకరమైన నేరంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవజాతిపై విశ్వాసం నశిస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. స్వరము లేని వారికి సహాయపడటానికి ఇచ్చిన శక్తిని మనం దుర్వినియోగం చేస్తున్నాము. బలహీనులను కాపాడటానికి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాము. ఎవరు బలహీనంగా కనిపిస్తే వారిపై మన అధికారాన్ని చూపిస్తున్నాం.. మనలోని క్రూరత్వాన్ని సంతృప్తి పరచడానికి పిల్లలను చంపుతున్నారని సాయిపల్లవి మండిపడింది. 
 
నేరం వెలుగులోకి వచ్చినప్పుడు లేదా సోషల్ మీడియాలో ట్రెండ్‌ అయినప్పుడు మాత్రమే న్యాయం జరిగే రోజు రాకూడదని నేను ప్రార్థిస్తున్నాను. గుర్తించబడని, రిపోర్ట్ చేయలేని నేరాల విషయంలో ఏం జరుగుతోందని సాయిపల్లవి ప్రశ్నించింది. 
 
ప్రతీ చోట ఇలాంటి దారుణాలు జరుగుతున్న విషయాలు తెలియజెప్పేందుకు హ్యాష్ ట్యాగ్‌లు పెట్టాల్సి వస్తోందని సెటైర్‌ వేసింది. చివరగా ఈ ఆవేదన అంతా ఏడేళ్ల బాలికకు జరిగిన ఘటనపై అని చెప్పడానికి #JusticeforJayapriya అనే హ్యాష్ ట్యాగ్‌ను సాయిపల్లవి జత చేసింది.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు