Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

దేవీ

మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (09:50 IST)
Pawn kalyan family- chiru
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. 
 
ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ గారికి ఈ విషయం తెలిసింది. పర్యటన నిలుపుదల చేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు, నాయకులు సూచించారు. ‘అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని… కాబట్టి ఆ గ్రామం వెళ్ళి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకొంటాన’ని శ్రీ పవన్ కల్యాణ్ గారు స్పష్టం చేశారు. అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని తెలిపారు.
 
మన్యంలో పర్యటన ముగించుకొని శ్రీ పవన్ కల్యాణ్ విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్ళేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన మెగాస్టార్ చిరంజీవి వెంటనే ఫోన్ లో పవన్ తో మాట్లాడారు. సోదరుడికి ధైర్యాన్ని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు