హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి గెలిస్తే పెద్దమ్మ గుడి కట్టిస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓటర్లకు హామీ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో ఈ స్థానానికి వచ్చే నెలలో ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, భారాసలు పోటీ పడుతున్నాయి. ఈ త్రిముఖ పోటీలో అభ్యర్థులు విజయం కోసం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రచారం చేస్తున్నారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ అంటే కేవలం అద్దాల మేడలు కాదని, ఇక్కడ ఎన్నో బస్తీలు ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఈ బస్తీల అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. 'గత ఎన్నికల్లో బీఆర్ఎస్పై కోపంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై కోపంతో మళ్లీ బీఆర్ఎస్కు ఓటు వేస్తే మరోసారి మోసపోతారు. బీజేపీతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం' అని బండి సంజయ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని బండి సంజయ్ ఆరోపించారు. ఈ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని విమర్శించారు. ఇదేసమయంలో ఎంఐఎం పార్టీని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. 'జూబ్లీహిల్స్లో పోటీ చేసే దమ్ము ఎంఐఎంకు లేదా?' అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఇది కీలకం కావడంతో ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుండగా, రేపటి నుంచి నామినేషన్ పత్రాల పరిశీలన జరగనుంది. ఉపసంహరణకు ఈ నెల 24 వరకు ఉంది. కాగా, ఈ ఎన్నికల్లో ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ ఏకంగా 40 మందికిపై నేతలను స్టార్ క్యాంపైనర్లుగా నియమించింది. వీరిలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు.