చిరంజీవి - బాలకృష్ణలతో నటిస్తే తప్పేంటి : శృతిహాసన్

ఆదివారం, 9 ఏప్రియల్ 2023 (16:54 IST)
టాలీవుడ్ అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలతో నటిస్తే తప్పేముందని హీరో కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్ అన్నారు. ఈ ఇద్దరు హీరోలతో ఆమె నటించిన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి చిత్రాలు గత సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ సాధించాయి. అయితే, చిరంజీవి, బాలకృష్ణల సరసన కుమార్తె వయసున్న శృతిహాసన్ నటించడంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. వీటిపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. 
 
బాలీవుడ్‌లో ఇప్పటికీ ఈ ట్రెండ్‌ కొనసాగుతోందని, అందువల్ల చిరంజీవి, బాలకృష్ణలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంపై వస్తున్న విమర్శలపై తాను బాధపడటం లేదన్నారు. 
 
'వయసు వ్యత్యాసాన్ని ఉద్దేశిస్తూ పలువురు చేసే కామెంట్స్‌ నన్ను ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే చాలా మంది ఆడియన్స్‌ ముఖ్యంగా ఆయా హీరోల అభిమానులు ఆ సినిమాలను మెచ్చుకున్నారు. వాళ్ల విమర్శలను నేను ప్రశంసగానే భావిస్తా. నటుడికి ఈ వయసు. నటికి ఈ వయసు. ఆ హీరోల పక్కన ఆమె సరిగ్గా సరిపోయిందని ఇప్పటివరకూ ఎవరూ అనలేదు. అందరూ నన్నింకా చిన్న పిల్లగానే చూస్తున్నారు. దానికి నేను ఆనందిస్తున్నా, జోక్స్‌ అన్నింటినీ పక్కన పెడితే.. ఆ పాత్ర చిత్రీకరణ నాకెంతో నచ్చింది. 
 
అలాగే, ఇద్దరు లెజండరీ నటులతో నటించే అవకాశం వచ్చింది. అలాంటప్పుడు నేనెందుకు ఆ సినిమాలకు నో చెప్పాలి. మరో విషయం ఏమిటంటే.. ఈ విమర్శలు నాకు వ్యక్తిగతంగా ఎదురైనవి కాదు. నా రోల్‌ను అలా రాసినందుకు? డైరెక్టర్‌ మమ్మల్ని ఎంచుకున్న విధానంపైనే విమర్శలు వస్తున్నాయి. కాబట్టి, వ్యక్తిగతంగా వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం తరచూ మాట్లాడుకునే బాలీవుడ్‌లోనూ వయసు వ్యత్యాసం ఉంటుంది' అని శ్రుతిహాసన్‌ వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు