అది ప్రేమ కాదు.. ఈగో.. కసి.. నాదన్న పొగరు : ప్రణయ్ హత్యపై హీరో మంచు మనోజ్

ఆదివారం, 23 సెప్టెంబరు 2018 (11:59 IST)
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్యపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ స్పందించాడు. ముఖ్యంగా, తన కుమార్తె అమృత ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎస్సీ వర్గానికి చెందిన ప్రణయ్‌ను హత్య చేసిన కోటీశ్వరుడు మారుతిరావు చర్యను మనోజ్ తప్పుబట్టాడు.
 
అమృతపై మారుతిరావుకు ఉన్నది ప్రేమ కాదన్నాడు. "అది ప్రేమ కాదు.. ఈగో, కసి, క్రూరత్వం.. నాది అన్న పొగరు.. ప్రేమ పేరుతో, ప్రేమ కోసం యాసిడ్ పోసేవాడికి, ప్రేమించినందుకు చంపేవాడికి తేడా లేదు. అప్పట్లో సతీదహనం కూడా కరెక్ట్ అనేవాళ్లున్నారు. మరి అది కూడా కరెక్టేనా బ్రో" అంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు మనోజ్ బదులిచ్చాడు.
 
అలాగే, మరొక ట్వీట్‌కి సమాధానంగా 'చంపేస్తాం, పొడిచేస్తాం, కాల్చేస్తాం అంటే భయపడి పారిపోక కూల్ డాడ్ అంటారా? ఆలోచించండి బ్రదర్... అలాంటి మూర్ఖుల్ని ప్రోత్సహించకండి. మీకు ఎందుకు రిప్లై ఇస్తున్నానంటే మీలాగా ఆలోచించే వాళ్లకు కొంచెం కళ్లు తెరుచుకుంటాయని ఒక నమ్మకం. బతకండి, బతకనివ్వండి' అంటూ విజ్ఞప్తి చేశాడు. 
 
అలాగే, ఇలా అనేక మంది నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు మంచు మనోజ్ చాలా ఓపిగ్గా సమాధానాలు ఇవ్వడం గమనార్హం. 'ప్రేమ, డబ్బు ఉన్నప్పుడు కూతురు మనసు తెలుసుకుని అర్థం చేసుకోవాల్సింది. వయసులో పెద్దవాడు ఆ మాత్రం తెలియదా? ఆ లెక్కన అయితే మనం అందరం ఇంగ్లీష్ వాళ్ల ప్యాంట్, షర్టులు ఆపేసి మన కులానికి తగ్గ ఇండియన్ బట్టలు వేసుకోవాలి. మన సౌకర్యానికి తగ్గట్టు మార్చుకోకూడదు' అంటూ అగ్రహం వ్యక్తం చేశాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు