42 విమానాలు 21 రోజులు 1400 గంటల ప్రయాణం: వాయువేగంతో దేశంలో ప్రాణవాయువు సరఫరా

బుధవారం, 12 మే 2021 (22:02 IST)
దిల్లీ: కరోనా రెండో దశ ఉద్ధృతితో దేశంలో ఆక్సిజన్‌ కొరత తీవ్రమైంది. ఈ విపత్కర పరిస్థితుల్లో భారత వాయుసేన గొప్పగా సాయం చేసింది. హనుమంతుడు ‘సంజీవని’ని తీసుకొచ్చినట్లుగా వాయువేగంతో ప్రాణవాయువును సరఫరా చేసి ఎంతో మంది రోగుల ప్రాణాలు నిలబెట్టింది. 42 విమానాలు 21 రోజులుగా 1400 గంటలకు పైగా ప్రయాణం చేసి దాదాపు 500 ఆక్సిజన్‌ ట్యాంకర్లను మోసుకొచ్చాయి. 
 
మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా, కొవిడ్‌ రిలీఫ్‌ ఆపరేషన్స్‌లో కోసం వాయుసేన 42 విమానాలను ఏర్పాటు చేసింది. ఈ మెగా ఆపరేషన్‌లో ఆరు సి-17, ఆరు ఇల్యూషిన్‌-76 విమానాలు, 30 మీడియం లిఫ్ట్‌ సి-130జేఎస్‌ విహంగాలు భాగస్వాములయ్యాయి. ఈ విమానాలు దేశం లోపల, విదేశాల నుంచి ఆక్సిజన్‌ ట్యాంకర్లను సరఫరా చేశాయి. ‘‘దేశీయంగా.. మా పైలట్లు 939 గంటల పాటు 634 ప్రయాణాలు జరిపి 403 ఆక్సిజన్‌ కంటైనర్లు, 163.3 మెట్రిక్‌ టన్నుల ఇతర వైద్య పరికరాలను ఆసుపత్రులకు చేర్చాయి’’ అని ఐఏఎఫ్‌ అధికారులు వెల్లడించారు.
 
ఆక్సిజన్‌, ఇతర సహాయ పరికరాల కోసం ఐఏఎఫ్‌ విమానాలు.. జర్మనీ, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, సింగపూర్‌ ఇలా తొమ్మిది దేశాలకు వెళ్లాయి. అంతర్జాతీయంగా ఈ విమానాలు 480 గంటల పాటు 98 ప్రయాణాలు జరిపి 95 ప్రాణవాయువు కంటైనర్లను విదేశాల నుంచి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు 200 టన్నుల రిలీఫ్‌ మెటీరియల్‌ను కూడా మోసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్‌ 21 నుంచి వాయుసేన ఈ ప్రత్యేక విమానాలను నడిపింది. సిబ్బందిని వైరస్‌ నుంచి రక్షించేందుకు బయో బబుల్‌ కూడా ఏర్పాటు చేసింది..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు