బీజేపీకి షాక్... కర్నాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి విజయభేరీ

మంగళవారం, 6 నవంబరు 2018 (20:11 IST)
వచ్చే యేడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న తరుణంలో కర్నాటక రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక ఉప ఎన్నికల్లో భాజపా ఘోర పరాభవం చవిచూసింది. 3 లోక్‌సభ స్థానాలు, 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగగా.. వీటిలో కేవలం ఒకే ఒక్క స్థానంలో మాత్రమే భాజపా విజయం సాధించింది. మిగతా నాలుగు చోట్ల అధికార కాంగ్రెస్‌-జేడీయూ కూటమి జయకేతనం ఎగురవేసింది. 
 
బళ్లారి, శివమొగ్గ, మాండ్య లోక్‌సభ స్థానాల్లో సిట్టింగ్‌ ఎంపీలు రాజీనామా చేయడం, రామనగర శాసనసభ స్థానాన్ని సీఎం కుమారస్వామి వదులుకోవడం, జమఖండీ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మృతిచెందడటంతో ఈ స్థానాల్లో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో గత శనివారం ఉపఎన్నికలు నిర్వహించి.. నేడు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఫలితాల్లో కాంగ్రెస్‌-జేడీయూ కూటమి భారీ విజయం సాధించింది. ఈ ఉప ఎన్నికల్లో రామనగర స్థానం నుంచి సీఎం కుమారస్వామి భార్య అనితా కుమారస్వామి బరిలోకి దిగారు. ఈమె తన సమీప భాజపా అభ్యర్థిపై దాదాపు లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు. 
 
అలాగే, బీజేపీతో పాటు... గాలి సోదరుల కంచుకోటగా ఉన్న బళ్లారి లోక్‌సభ స్థానం కూడా ఈ దఫా కాంగ్రెస్ వశమైంది. బళ్లారిలో భాజపా అభ్యర్థి శాంతపై కాంగ్రెస్‌ అభ్యర్థి ఉగ్రప్ప భారీ మెజార్టీతో గెలుపొందారు. బళ్లారిలో 2004 నుంచి భాజపానే గెలుస్తూ వస్తోంది. అంతేగాక గాలి జనార్దన్‌ రెడ్డి సోదరులకు మంచి పట్టున్న నియోజకవర్గం. తాజాగా వెలువడిన ఫలితాల్లో తొలి రౌండ్‌ నుంచే ఆధిక్యం ప్రదర్శించిన ఉగ్రప్ప దాదాపు 2లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 
 
మాండ్య, జమఖండీలో సంకీర్ణం విజయం మరో లోక్‌సభ నియోజకవర్గమైన మాండ్యలో జేడీఎస్‌ అభ్యర్థి శివరామ గౌడ గెలుపొందారు. అయితే, బీజేపీ శివమొగ్గ లోక్‌సభ స్థానంలో మాత్రమే గెలుపొందింది. ఈ ఎన్నికల్లో భాజపా నుంచి యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర బరిలోకి దిగారు. జేడీఎస్‌ నుంచి మరో మాజీ ముఖ్యమంత్రి ఎస్‌. బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప పోటీ చేశారు. మధుకు కాంగ్రెస్‌ మద్దతిచ్చింది. ఫలితాల్లో రాఘవేంద్ర, మధు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఒక దశలో మధు ఆధిక్యం కూడా కనబర్చారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన శివమొగ్గ ఉపఎన్నికలో చివరకు రాఘవేంద్ర 50 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు