భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రావిడ్.. కాంట్రాక్ట్ పొడగింపు

బుధవారం, 29 నవంబరు 2023 (14:39 IST)
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌ను నియమించారు. ఇటీవల స్వదేశంలో జరిగిన ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీతో రాహుల్ కాంట్రాక్టు ముగిసిపోయింది. దీంతో ఆయన కోచ్‌గా కొనసాగేందుకు ఏమాత్రం సుముఖంగా లేడంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన కాంట్రాక్టును పొడగిస్తూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దాంతో వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ కు కూడా ద్రావిడే కోచ్‌గా కొనసాగుతాడు.
 
వాస్తవానికి కోచ్‌గా ద్రావిడ్ పదవీకాలం వరల్డ్ కప్‌తో ముగిసింది. మళ్లీ కోచ్‌గా కొనసాగేందుకు ద్రావిడ్ సుముఖంగా లేడంటూ వార్తలు వచ్చాయి. అయితే, పలు సంప్రదింపుల అనంతరం కోచ్‌గా కొనసాగేందుకు ద్రావిడ్ అంగీకరించడంతో బీసీసీఐ ప్రకటన చేసింది. భారత క్రికెట్ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ కొనసాగుతాడని, ఇతర సహాయక సిబ్బంది కాంట్రాక్టును కూడా పొడిగిస్తున్నామని బోర్డు వెల్లడించింది. ద్రావిడ్‌తో చర్చలు ఫలప్రదం అయ్యాయని తెలిపింది.
 
బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ మాట్లాడుతూ, రాహుల్ ద్రావిడ్ విజన్, ప్రొఫెషనలిజమ్ టీమిండియా విజయాలకు మూలస్తంభాల వంటివన్నారు. ద్రావిడ్ సవాళ్లకు ఎదురొడ్డి నిలిచి భారత క్రికెట్ జట్టును తీర్చిదిద్దాడని కొనియాడారు. ద్రావిడ్ వ్యూహాత్మక మార్గదర్శకత్వానికి టీమిండియా ప్రదర్శనే గీటురాయి అని వివరించారు. హెడ్ కోచ్‌గా కొనసాగేందుకు ద్రావిడ్ అంగీకరించడం పట్ల ఎంతో సంతోషిస్తున్నానని రోజర్ బిన్నీ తెలిపారు. ద్రావిడ్ కోచ్‌గా టీమిండియా విజయ ప్రస్థానం కొనసాగుతుందనడంలో తనకెలాంటి సందేహం లేదని అన్నారు. 
 
అలాగే, బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందిస్తూ... టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ కంటే మెరుగైన వ్యక్తి మరొకరు లేరని స్పష్టం చేశారు. ప్రతిభ పరంగానూ, నిబద్ధత పరంగానూ కోచ్‌గా ద్రావిడ్ తనను తాను నిరూపించుకున్నారని కొనియాడారు. ఇప్పుడు టీమిండియా అన్ని ఫార్మాట్లలో శక్తిమంతమైన జట్టుగా రూపొందిందని, మూడు ఫార్మాట్ల ర్యాంకింగ్స్‌లో మన జట్టుకు అగ్రస్థానం ద్రావిడ్ విజన్‌కు ప్రత్యక్ష నిదర్శనం అని కితాబునిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు