యూరప్ దేశంలోని నార్త్ మెసిడోనియాలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. నైట్ క్లబ్లో సంగీత కార్యక్రమం జరుగుతున్న సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 59 మంది సజీవదహనమయ్యారు. మరో 155 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొకాని పట్టణంలోని పల్స్ నైట్ క్లబ్లో స్థానిక పాప్ బృందం కన్సర్ట్ నిర్వహిస్తుండగా సోమవారం తెల్లవారుజామున 2.35 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ఈ కార్యక్రమంలో బాణాసంచా కాల్చడంతో పైకప్పునకు మంటలు అంటుకున్నాయి. దీన్ని గమనించిన పాప్ బృందం వెంటనే అక్కడ నుంచి అందరూ వెళ్లిపోవాలని కోరింది. దీంతో ఏం జరిగిందో అర్ధంకాక గందరగోళం మధ్యే యువతీయువకులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ లోపే దట్టమైన పొగ కమ్మేయడంతో ఊపిరాడని పరిస్థితి నెలకొంది. ఈ కార్యక్రమంలో దాదాపు 1500 మంది పాల్గొన్నారు. వీరిలో ఎక్కువ మంది యువతీ యువకులే. మరణించిన వారిలో ఇప్పటివరకు 39 మందిని గుర్తించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై మెసిడోనియా ప్రధానమంత్రి హ్రిస్టిజన్ మికోస్కీ ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. ఇది మెసిడోనియాకు విచారకరమని, చాలా మంది యువతీ యువకులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన దేశానికి పూడ్చలేని నష్టంగా ఆయన అభివర్ణించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.