సానుకూల స్పందన కోసం ఎదురుచూస్తున్నా: ప్రధాని

గురువారం, 29 అక్టోబరు 2009 (13:06 IST)
కాశ్మీర్ అంశంలో పాకిస్థాన్‌తో పాటు.. వేర్పాటువాద సంస్థల నుంచి సానుకూల స్పందన కోసం ఎదురుచూస్తున్నట్టు ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన గురువారం అనంతనాగ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అనేక చర్యలను ఇప్పటికే చేపట్టిందన్నారు.

అలాగే, ఇక్కడ శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్న వారితో కూడా చర్చలు జరపాలనే ఉద్దేశ్యం ఉన్నట్టు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వ ప్రతినిధులతో పాటు.. వివిధ రాజకీయ పార్టీల నేతలతో సుభప్రదమైన చర్చలు జరిగినట్టు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో ఉన్న వేర్పాటువాద శక్తులతో పాటు.. పొరుగు దేశంతో శాంతి చర్చలను ప్రతిపాదిస్తున్నట్టు చెప్పారు.

అదేసమయంలో రాష్ట్ర అభివృద్ధికి అన్ని వర్గాలు ఒకటిగా ఉండాలని, ఇందులో యువత అధిక సంఖ్యలో భాగస్వాములు కావాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. కాశ్మీర్ ప్రకృతి వనరులకు పుట్టినిల్లుగా ఉంది. అలాగే ఇక్కడ యువత కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలకు ధీటుగా అభివృద్ధి చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇందుకోసం అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అన్ని వేళలా సిద్ధంగా ఉందన్నారు.

వెబ్దునియా పై చదవండి