18 సంవత్సరాలలోపు వయసు కలిగిన వారితోపాటు 35 సంవత్సరాల వయసు నిండిన వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాల్సిందిగా గ్రామ వలంటీరు సచివాలయం, వార్డు వలంటీరు సచివాలయం శాఖ డైరెక్టర్, కమిషనర్ జీఎస్.నవీన్కుమార్ ఉత్తర్వులు జారీ చేయడంతో వలంటీర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
50 ఇళ్లకు ఒక వలంటీరును నియమిస్తూ రాష్ట్రంలో 2.60 లక్షల మందిని గ్రామ, వార్డు వలంటీర్లను నియమించారు. ఈ సంఖ్య జిల్లాలో 30 వేలకు పైబడే ఉంది. వీరంతా అధికార వైసీపీ గ్రామ, మండలస్థాయి నాయకులతో పాటు ఎమ్మెల్యేల సిఫారసులతో నియమితులైన వారే అత్యధికం.
ఈ అంశం కొంతకాలం నుంచి చర్చనీయాంశమైంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 35 ఏళ్లు నిండిన వలంటీర్ల నియామకం జరిగిన దృష్ట్యా వారిని విధుల నుంచి తొలగించాలని, ఆ ఖాళీల భర్తీకి తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశాలు అందాయి.
ఈ ఉత్తర్వులు ఖచ్చితంగా అమలైతే జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు ప్రకారం 35 సంవత్సరాల వయస్సు దాటిన వారి సంఖ్య వందల్లో ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వలంటీర్లలో ఆందోళన నెలకొంది. నిబంధనలు అనుసరించి 35 సంవత్సరాలు దాటి ఒక్కరోజు ఉన్నా సరే సదరు వలంటీరును ఉద్యోగం నుంచి తొలగింపు చేస్తారు.