ముగిసిన కోర్ కమిటీ భేటీ: వీడని సందిగ్ధత!

గురువారం, 10 సెప్టెంబరు 2009 (20:43 IST)
స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి వారసుని ఎంపికపై చర్చించేందుకు భేటీ అయిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. అయితే, వారసుని ఎంపికపై కోర్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం బయటకు వెల్లడించలేదు. ఫలితంగా సీఎం అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠత కొనసాగుతోంది.

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం తెల్సిందే. ఫలితంగా రాష్ట్రంలో నాయకత్వ సంక్షోభం తలెత్తింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా సీనియర్ మంత్రి రోశయ్యను ఎంపిక చేశారు. అయితే, పూర్తిస్థాయి ముఖ్యమంత్రిగా వైఎస్ తనయుడు వైఎస్.జగన్‌ను ఎంపిక చేయాలని రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

దీంతో రాష్ట్ర రాజకీయాలు రసదాయకంలో పడటమే కాకుండా, కాంగ్రెస్ అధిష్టానికి తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలో తొమ్మిది రోజుల పాటు అనుసరించిన వైఎస్ సంతాప దినాలు బుధవారంతో ముగిశాయి. దీంతో సీఎం అభ్యర్థిత్వంతో పాటు.. రాష్ట్ర రాజకీయాలపై చర్చించేందుకు కాంగ్రెస్ కోర్ కమిటీ గురువారం సాయంత్రం ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఆయన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయింది.

ఇందులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు.. కోర్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. గంటపాటు సాగిన ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నరో బయటకు పొక్కనీయలేదు. ఇదిలావుండగా, సమావేశం ముగిసిన తర్వాత సోనియా రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జి అహ్మద్ పటేల్‌తో వైఎస్ ఆప్తమిత్రుడు కేవీపీ.రామచంద్రరావు భేటీ అయ్యారు. ఆ తర్వాత మరో సీనియర్ నేత కే.కేశవరావు సమావేశమయ్యారు. వీరి మధ్య జరిగిన చర్చల సారాంశం మాత్రం వెల్లడించక పోవడంలో అంతా ఉత్కంఠత నెలకొంది.

వెబ్దునియా పై చదవండి