రాజకీయ నాయకుల ఆస్తుల వివరాలు సామాన్య ప్రజలకు తెలిస్తే షాక్ తినాల్సిందే. అలాంటిది ఆంధ్రప్రదేశ్కు చెందిన 20 మంది మంత్రులు భారత్లోనే అత్యంత సంపన్నుల జాబితాలో స్థానం దక్కించుకున్నారని తెలిస్తే మరోసారి వామ్మో అంటూ నోరెళ్లబెడతారు. ఇంతకీ విషయం ఏంటంటే..? భారత్లోనే అత్యంత సంపన్నుల జాబితాలో ఏపీ మున్సిపల్ శాఖా మంత్రి పి. నారాయణ అగ్రస్థానంలో నిలిచి రికార్డు సృష్టించారు.
అలాగే ఏపీకి చెందిన మరో 20 మంది మంత్రులు కూడా ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. ఢిల్లీకి చెందిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో దేశంలోని 29 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో పనిచేసే మంత్రుల ఆదాయంపై చేసిన సర్వేలో.. నారాయణ టాపర్గా నిలిచారు. ఈ క్రమంలో నారాయణ మొత్తం ఆస్తి విలువ రూ.496 కోట్లుగా తేలింది.
పంజాబ్, పుదుచ్చేరి, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలకు చెందిన మంత్రులంతా కోటీశ్వరులే. మధ్యప్రదేశ్, తమిళనాడుకు చెందిన 51 మంది మహిళా మంత్రులు కోటీశ్వరుల జాబితాలో ఉండడం విశేషం. ఇక పలు రాష్ట్రాలకు చెందిన 210 మంది మంత్రులు క్రిమినల్ కేసుల్లో చిక్కుకున్నారు. వీరిలో 113 మందిపై కిడ్నాప్, హత్య కేసులు ఉన్నాయి.