పూర్వకాలంలో బాల్య వివాహాలు గ్రామంలో అధికంగా చేసేవారు. పేదరికంతో సతమతమయ్యేవారు తమ కుమార్తెలను డబ్బున్న వృద్ధులకు ఇచ్చి పెళ్లి చేసేవారు. కానీ ఇలాంటి వివాహాలను అరికట్టేందుకు ఎన్ని చట్టాలు వచ్చినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. కానీ ఇక్కడ ఓ యువతి మాత్రం తనే ఇష్టపడి ఓ వృద్ధుడిని పెళ్ళాడి వార్తల్లో కెక్కింది. బెంగళూరులో 26 ఏళ్ల యువతి 64 ఏళ్ల వృద్ధుడిని పెళ్లాడింది. అయితే, ఈ పెళ్లికి యువతి తల్లిదండ్రులు, బంధువులు అడ్డుచెప్పడంతో కలకలం సృష్టిస్తుంది.
ఈ పూర్తి వివరాలను పరిశీలిస్తే... బెంగళూరుకు చెందిన హసన్ముఖ హెచ్.ప్రజాపతి కుమార్తె కృపా హెచ్.ప్రజాపతి (27) హెణ్ణూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ సెంటర్(ఎన్ఐసీసీ)లో ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు చేస్తోంది. కాగా అదే ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న ఎన్ఐసీసీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆకాష్ కుమార్(64)ను ప్రేమించింది. మొదటి చూపులోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
కాగా కృపా తల్లిదండ్రులు ఈ ప్రేమను నిరాకరించారు. తల్లిదండ్రులు ప్రేమను అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఈ ప్రేమజంట తమను తల్లిదండ్రులు ఎక్కడ విడదీస్తారనే భయంతో నెల క్రితం నగరంలోని రాజరాజేశ్వరి నగర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెద్దలకు తెలియకుండా రహస్య వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి తల్లిదండ్రులతో మాట్లాడటం మానేసిన కృపా.. తన భర్త డాక్టర్ ఆకాష్ కుమార్తోనే కలిసి జీవిస్తోంది.
తమ వివాహ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవడానికి వారిద్దరూ శుక్రవారం ఉదయం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న కృపా తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకొని ఆకాష్ కుమార్పై దాడికి దిగారు. ఆడపిల్లలకు డబ్బు ఆశ చూపించి వారికి మాయమాటలు చెప్పి, మోసగించి అనంతరం... పెళ్లి చేసుకుని, విడాకులు ఇవ్వడం ఆకాష్కు అలవాటేనంటూ తిట్లవర్షం కురిపించారు.
దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ అంశంపై కృపా హెచ్.ప్రజాపతి స్పందిస్తూ.. చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు తనపై వివక్ష చూపుతూనే ఉన్నారని చెప్పింది. ప్రతి విషయంలోనూ తల్లిదండ్రులు తనని వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు చెప్పింది. కృపా ఆరోపణలను ఆమె తల్లిదండ్రులు ఖండించారు.