తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు (సిట్) చేస్తున్న విచారణలో విస్తుగొలిపే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఉత్తరాఖండ్కు చెందిన భోలేబాబా డెయిరీ తిరుపతి నగరంలోని ఓ చిన్న డెయిరీని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు కల్తీ నెయ్యి సరఫరా చేసినట్టు అధికారులు గుర్తించారు. ఈ ప్రధాన ఆలయాల్లో దుర్గమ్మ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమల వంటి పుణ్యక్షేత్రాలకూ భోలేబాబా సంస్థనే పరోక్షంగా నెయ్యిని సరఫరా చేసినట్టు సిట్ అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు.
తిరుపతిలోని డెయిరీకి కమిషన్లు చెల్లించి ఆ కంపెనీ పేరుతో కల్తీ నెయ్యి పంపినట్టు విచారణాధికారులు నిగ్గు తేల్చారు. ఇప్పటివరకు తితిదేకు మాత్రమే కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని అంతా భావిస్తున్నారు. ఈ తరుణంలో ఏ12గా ఉన్న భోలేబాబా డెయిరీ జనరల్ మేనేజర్ హరి మోహన్ రాణా నెల్లూరు ఏసీబీ కోర్టులో మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, ఏపీపీ జయశేఖర్ వ్యతిరేకిస్తూ ఈ నెల 17వ తేదీన తమ వాదనలు వినిపించారు.
ఆ సందర్భంగా ఏపీపీ ఆశ్చర్యకర విషయాలను వెల్లడించారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో నిందితుడు మాస్టర్మైండ్ అని, బయటకు వస్తే సాక్ష్యాధారాలు మాయం చేస్తారని, సాక్షులను ప్రభావితం చేస్తారని ఏపీపీ వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి సరస్వతి గురువారం బెయిల్ పిటిషన్ను తిరస్కరించారు.