వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి టీవీ చానెల్లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో అమరావతి మహిళలను వేశ్యలతో పోల్చిన అంశం ఇపుడు రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా, అమరావతి మహిళలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. సాక్షి దినపత్రిక కార్యాలయాల ముందు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లోని సాక్షి కార్యాలయాల వద్ద ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఆందోళనకారులు కార్యాలయాల బోర్డులను తొలగించి, కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్ సతీమణి వైఎస్ భారతి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
ముఖ్యంగా విజయవాడ ఆటో నగర్లోని సాక్షి ప్రధాన కార్యాలయం వద్ద అమరావతికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కార్యాలయం ముందున్న బోర్డును వారు తొలగించారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన సాక్షి యాజమాన్యం, కార్యాలయ ప్రధాన గేటుకు తాళం వేసింది. దీంతో ఆగ్రహం చెందిన కొందరు మహిళా నేతలు గేటుపైకి ఎక్కి తమ నిరసను కొనసాగించారు. మహిళలపై చేసిన అసభ్యకర వ్యాఖ్యల పట్ల జగన్, భారత్, వెంటనే క్షమాపణ చెప్పాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంత వాసులు, మహిళలు సాక్షి కార్యాలయంపై కోడిగుడ్లు కూడా విరిసినట్టు సమాచారం.