గుర్తింపు, గౌరవం లేనిచోట ఉండలేను... ఆవేదనలో ఆనం రామనారాయణ

బుధవారం, 13 జూన్ 2018 (09:33 IST)
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవించి ఉన్నసమయంలోనూ, ఆ తర్వాత ముఖ్యమంత్రులుగా పనిచేసిన కె. రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిల హయాంలోనూ ఓ వెలుగు వెలిగిన రాజకీయ నేత ఆనం రామనారాయణ రెడ్డి. సీనియర్ మంత్రిగా కొనసాగారు.
 
కానీ, రాష్ట్ర విభజన తర్వాత ఆయన నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గత కొంతకాలంగా అక్కడే చడీచప్పుడు లేకుండా ఉంటున్నారు. 
 
అయితే, ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. పార్టీ మారుతున్నారా అని మంగళవారం రాత్రి విలేకరులు ప్రశ్నించినప్పుడు... 'ఎన్నో పదవులు చేపట్టాను.. సమర్థంగా పనిచేశాను. కానీ గుర్తింపు, గౌరవం లేని చోట ఉండలేను' అని వ్యాఖ్యానించారు. 
 
జిల్లావ్యాప్తంగా తమ కుటుంబానికి సన్నిహితులు, అనుచరులు, అభిమానులు ఉన్నారని, వారందరితో చర్చించి తన రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో సన్నిహితులు ఉన్నారని.. వారందరితో చర్చిస్తానని చెప్పారు. 
 
సో.. ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ మారడం ఖాయమని తేలిపోయింది. ఈయన అన్న ఆనం వివేకానంద రెడ్డి ఇటీవలే కన్నుమూసిన విషయం తెల్సిందే. ఈయన వైకాపాలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన జగన్‌ సన్నిహితులతో మంతనాలు జరిపినట్టు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు